దోమలపై దండయాత్ర ప్లాప్...వాటికి విచక్షణ ఉండదు:విష్ణుకుమార్ రాజు వ్యంగాస్త్రాలతో అసెంబ్లీలో నవ్వులు
అమరావతి:రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 'దోమలపై దండయాత్ర' కార్యక్రమం గురించి విశాఖ నార్త్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఏపీ అసెంబ్లీలో సంధించిన వ్యంగాస్త్రాలు అసెంబ్లీలో నవ్వుల వర్షం కురిపించాయి.
ఈ దోమలపై దండయాత్రలో తాను కూడా పాల్గొన్నానని, తనతో పాటు మరో ఇద్దరు మంత్రులు, జీవీఎంసీ అధికారులు, విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చెబుతూ తామంతా ఇంత కష్టపడినా 'దోమలపై దండయాత్ర' మాత్రం అట్టర్ ప్లాప్ అయ్యిందని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు దోమలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో ఎమ్మెల్యేలు ఘొల్లుఘొల్లున నవ్వారు.
దోమల కారణంగా మొత్తం రెండు లక్షలా ఎనభై ఎనిమిదివేల మందికి జ్వరాలు వచ్చాయని...వీరిలో తన కుమారుడు కూడా ఉన్నాడని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఈ సందర్భంగా తెలిపారు. "దోమలకు విచక్షణ ఏమీ ఉండదు అధ్యక్ష్యా...మీరు మేము అనే తేడా ఏమీ ఉండదు...అందర్నీ కుట్టేస్తున్నాయ్" అని విష్ణుకుమార్ రాజు అనగానే ఆ మాటకు స్పీకర్తో సహా...సభలో ఉన్న సభ్యులందరూ ఒక్కసారిగా ఘొల్లున నవ్వారు. దీంతో అలా కాసేపు సభలో నవ్వుల దొంతరలు కొనసాగుతూనే ఉన్నాయి.
విష్ణుకుమార్ రాజు తన ప్రసంగం కొనసాగిస్తూ..." అధ్యక్షా.. కిందటి సంవత్సరంతో పోలిస్తే...ఇప్పుడు దోమ కాట్లు మరింత పెరిగాయి...ఇంతకు మునుపు మా కామినేని శ్రీనివాస్ మంత్రిగా ఉండేవారు. ఆయన వెళ్లిపోయినప్పట్నుంచి ఈ దోమల పోరాటం బాగా ఎక్కువైపోయింది. అసలు ఇది మంత్రికి సంబంధమా...? మున్సిపాలిటీకి సంబంధమా...?...మీరే చెప్పాలి...అధ్యక్షా (స్పీకర్) మీరు కూడా డాక్టరే... కానీ మిమ్మల్ని కూడా దోమలు కుట్టేస్తాయ్. దయచేసి దీనిమీద సీరియస్గా ప్రణాళిక రూపొందించకపోతే చాలా ఇబ్బంది అవుతుంది" అని చెప్పుకొచ్చారు.
విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలతో సభలో అలా నవ్వుల పర్వం మరికొంతసేపు కొనసాగింది. అనంతరం విశాఖపట్టణం సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ విష్ణుకుమార్ వ్యాఖ్యలపై స్పందిస్తూ...బీజేపీ ఎమ్మెల్యే చెబుతున్నవన్నీ అబద్ధాలేనని...ఈ మాటలన్నీ ప్రజల్లో భయం కలిగించడానికేనని అన్నారు. ఇలా మాట్లాడటం మంచి పద్ధతి కాదని ఆయన హితవు పలికారు.
ఈ విమర్శలపై ప్రతిస్పందించిన బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు...బీజేపీపై ఆరోపణలు చేయడం టీడీపీకి అలవాటైపోయిందని అన్నారు. అసెంబ్లీలో మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి విషయంలో బీజేపీ అడ్డుపడుతోందని టీడీపీ సభ్యులు ఆరోపణలు చేయడం సరికాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధిని అడ్డుకునే అవసరం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు. సీఎం మెప్పు కోసం టీడీపీ సభ్యులు తమపై ఆరోపణలు చేస్తున్నారని విష్ణుకుమార్రాజు మండిపడ్డారు