మా కూతుర్ని చంపుకునేందుకు అనుమతి ఇవ్వండి: మరో మెర్సీ కిల్లింగ్ పిటిషన్
అమరావతి: బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న తమ కుమార్తెను చంపుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారో తల్లిదండ్రులు. ఈ సంఘటన సోమవారం మదనపల్లి రెండో అదనపు జిల్లా కోర్టులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... మదనపల్లి విజయనగర్ కాలనీలో నివాసం ఉంటున్న రాయిపేట నారాయణ, శ్యామల దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి రెండవ కుమార్తె రెడ్డిమాధవి మదనపల్లిలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదవుతోంది. ఏడాది కాలంగా ఆమె బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతోంది. దీంతో తిరుపతి, హైదరాబాద్లలో పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో చూపించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.
ఆ తర్వాత బెంగుళూరులోని ఓ ప్రముఖ కార్పోరేట్ ఆసుపత్రిలో చూపిస్తే రూ. 10 లక్షల ఖర్చుతో ఆమెకు నయం అయ్యేలా వైద్యం చేస్తామని చెప్పారు. దీంతో కూలీ పనులు చేసుకునే తాము అంతమొత్తం భరించలేమని, ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళనతో తాము కాలం వెళ్లదీస్తున్నామని తెలిపారు.
రెడ్డిమాధవి ఆరోగ్యం నానాటికీ క్షీణిస్తుండటంతో తమ కుమార్తెను చంపుకునేందుకు అనుమతి ఇవ్వాలని మదనపల్లి రెండో అదనపు జడ్జికి పిటిషన్ దాఖలు చేసుకున్నారు. అయితే కోర్టు ఆ పిటిషన్ను స్వీకరించలేదు. ఇటీవలే సరిగ్గా ఇలాంటి సంఘటనే చితూరు జిల్లాలోని తంబళ్ళపల్లి కోర్టులో నమోదైన సంగతి తెలిసిందే.
పుట్టినప్పటి నుంచీ కాలేయ సమస్యతో బాధపడుతున్న ఓ చిన్నారి (8నెలలు)కి చికిత్స చేయించేందుకు రూ.50 లక్షల వరకు అవుతుందని బెంగళూరులోని ఓ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. దీంతో తమకు అంత స్తోమత లేదని చిన్నారి తల్లిదండ్రులు మెర్సీ కిల్లింగ్కు పిటిషన్ దాఖలు చేయగా తంబళ్ళపల్లి కోర్టు తిరస్కరిస్తూ హైకోర్టుకు వెళ్ళాలని సూచించింది.