రాముడిపై పోలవరం ఎఫెక్ట్, ఏపీలో కలవడం హ్యాపీయే!
హైదరాబాద్: పోలవరం బిల్లు నేపథ్యంలో ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్లో కలుస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ విలీనం భద్రాచలం శ్రీరాముడిని కూడా తాకింది! ఇప్పటికే తెలంగాణ నేతలు.. రాముడు తెలంగాణకు, రాముని ఆస్తులు ఆంధ్రప్రదేశ్గా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏడు మండలాలను ఏపీలో కలుపుతున్నందున శ్రీరాముడు, జటాయువు మందిరంలు కూడా వేరు కానున్నాయి. ముంపు మండలాలను ఏపిలో కలుపుతున్న నేపథ్యంలో భద్రాచలం ఆలయానికి సంబంధించిన, దగ్గరలోనే ఉన్న జటాయువు మందిరం ఏపీలోకి వెళ్తోంది.
రామాయణంలో జటాయువు పాత్ర కొద్దిగా ఉన్నప్పటికీ చాలా ముఖ్యమైనది. సీతమ్మ తల్లిని రావణాసురుడు ఎత్తుకు పోయిన సందర్భంలో.. రావణునితో జటాయువు పోరాడి రెక్కలు పోగొట్టుకుంటుంది. ఆ తర్వాత సీతమ్మ కోసం వెతుకుతున్న రాముడికి కనిపించి వివరాలు చెబుతుంది.
ఏడు మండలాల ఆనందం!
ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలుపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏడు మండలాలలోని పలువురు గ్రామస్తులు ఆనందంగా ఉన్నారట. 1956కు ముందు భద్రాచలం డివిజన్ ఏపీలోనే ఉండేది. సీమాంధ్ర, తెలంగాణలు కలిసి రాష్ట్రం ఏర్పడినందున పరిపాలన సౌలభ్యం కోసం ఖమ్మం జిల్లాలో కలిపారు.
విభజన నేపథ్యంలో ఇప్పుడు ఆ మండలాలలోని గ్రామాలు ఏపీలోకి వెళ్తున్నాయి. దీంతో తమ అలనాటి సొంత రాష్ట్రంలోకి వెళ్తున్నందుకు చాలామంది ఆనందం వ్యక్తం చేస్తున్నారట. అయితే, తాము నష్టపోతున్నందున తమకు కేంద్రం, రాష్ట్రం భారీగా పరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారట.