Rains in Andhra Pradesh : ఏపీలో నేడు,రేపు వర్షాలు... ఆ ప్రాంతాల్లో పెరిగిన ఉష్ణోగ్రతలు...
ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రవ్యాప్తంగా నేడు,రేపు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో తక్కువ ఎత్తులో పశ్చిమ, నైరుతి గాలులు వీస్తున్నందునా వర్ష సూచన ఉన్నట్లు పేర్కొంది.వాయువ్య,పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడి ఆంధ్రప్రదేశ్ నుంచి దూరంగా వెళ్లడంతో.. గురువారం దక్షిణ కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. కావలిలో 38.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఉత్తర కోస్తాలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిశాయి.
ఢిల్లీతో పాటు ఆ రాష్ట్రాలకు వర్ష సూచన :
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల ప్రజలు భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో వచ్చే రెండు మూడు రోజులు మేఘావృతమై వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములుమెరుపులతోపాటు పిడుగులుపడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లోనూ వర్షాలతోపాటు చలిగాలులు వీయనున్నాయని తెలిపింది. ఉరుములుమెరుపులు, పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది.
ఢిల్లీలో గురువారం పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసింది.కొన్నిచోట్ల బలమైన ఈదురు గాలులు వీచినట్లు తెలుస్తోంది.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఢిల్లీలో సెప్టెంబర్ 18వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీతో పాటు ఉత్తరాఖండ్,పశ్చిమ బెంగాల్,తూర్పు రాజస్తాన్,గుజరాత్,మధ్యప్రదేశ్లలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
Recommended Video
121 ఏళ్ల తరువాత ఢిల్లీలో గత శుక్ర, శనివారాల్లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. 1975 తరువాత ఈ ఏడాది రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. గడిచిన నాలుగు నెలలల్లో ఢిల్లీలో 113.9 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వర్షాకాలంలో కురవాల్సిన 60 శాతం వర్షపాతం 7 రోజుల్లోనే నమోదు కావడం గమనార్హం. శనివారం కురిసిన భారీ వర్షానికి ఢిల్లీ నగరంతోపాటు విమానాశ్రయం కూడా జలమయమైన విషయం తెలిసిందే. రోడ్లపై మోకళ్లలోతు వరకు నీరు నిలిచపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.