హైదరాబాద్ మెట్రోలో ఉద్యోగాలు: మోసపోవద్దని ఎండీ హెచ్చరిక
హైదరాబాద్: మెట్రో రైలులో ఉద్యోగాల పేరుతో వస్తున్న ప్రకటనలు అవాస్తవమని, దళారులను నమ్మి మోసపోవద్దని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి సోమవారం తెలిపారు. ఆయన ఈ రోజు విలేకరులతో మాట్లాడారు. అఖిల పక్షం తర్వాతనే మెట్రో రైలు మార్పు, చేర్పుల పైన స్పష్టత ఇస్తామని చెప్పారు.
మెట్రో రైలు పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. మెట్రోలో ఉద్యోగాల పేరుతో కొన్ని ప్రకటనలు వస్తున్నాయని, అవన్నీ సరికాదన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని కొందరు మోసం చేస్తున్నారన్నారు. క్యాంపస్ నియామకాల ద్వారానే ఉద్యోగ అవకాశాలు ఉంటాయని చెప్పారు. దళారులను నమ్మి ప్రజలు మోసపోవద్దని తెలిపారు.
కాగా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో మెట్రో రైలు ప్రాజెక్టు లాభదాయకం కాదని ఆందోళన వ్యక్తం చేస్తూ వరుసగా లేఖలు రాసిన ఎల్ అండ్ టీ కంపెనీ యాజమాన్యం, ఇటీవల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పట్ల కేసీఆర్ చిత్తశుద్ధితో ఉన్నారని కంపెనీ చైర్మన్ నాయక్ కొద్ది రోజుల క్రితం కొనియాడారు. ఈ మేరకు ఆయన అప్పుడు కేసీఆర్కు ఒక లేఖ రాశారు. సామాజిక, ఆర్థిక రంగాల్లో రాష్ర్టాన్ని అభివృద్ధి చేసి బంగారు తెలంగాణ సాధించాలనే కేసీఆర్ సంకల్పం తనను ఎంతో ఆకట్టుకుందన్నారు.
ఇందుకు ఎల్ అండ్ టీ కంపెనీ తరఫున అన్ని విధాల చేయూత అందిస్తామన్నారు. ఇటీవల కేసీఆర్ను కలిసినపుడు మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన పలు అంశాలపై చర్చలు జరిపినట్టు చెప్పారు. కేసీఆర్ చొరవ, ముందు చూపు ఉన్న నేత అని ఆయన కొనియాడారు.
ప్రణాళిక, దూరదృష్టి ఉన్న కేసీఆర్ లాంటి నేతల వలనే దీర్ఘకాలిక అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ చేపట్టే అన్ని కార్యక్రమాల్లో ఎల్ అండ్ టీ కంపెనీ భాగస్వామి అవుతుందన్నారు. తెలంగాణలో చేపట్టే విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు తమ వంతు సహకారమందిస్తామన్నారు.
సూరత్ సమీపంలోని హజీరాలో ఉన్న తమ కంపెనీ ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించేందుకు రావాలని నాయక్ కేసీఆర్ను ఆహ్వానించారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఆయన రూపొందించిన ప్రణాళిక అబ్బురపరిచిందన్నారు. తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అదే సమయంలో వారు కేసీఆర్ చెప్పిన దారిలో మెట్రో మార్పుకు అంగీకరించారు. అయితే, దీనిని మొదట అఖిల పక్షం ముందుకు తీసుకురానున్నారు.