బెజవాడలో, విశాఖలోనూ మెట్రో రైలు: శ్రీధరన్
విశాఖపట్నం: విజయవాడతో పాటు విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభిస్తామని, రెండు నగరాల్లో ఒకేసారి ఆ ప్రాజెక్టును ప్రారంభిస్తామని మెట్రో ప్రాజెక్టు సలహాదారు శ్రీధరన్ చెప్పారు. విశాఖలో మెట్రో రైలు ప్రతిపాదిత ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
విశాఖపట్నం మెట్రో రైలుకు 6 నెలల్లో సమగ్ర నివేదికను తయారు చేస్తామని అన్నారు. విశాఖ మెట్రో ప్రాజెక్టు మొదటి దశలో 30 కిలోమీటర్ల కారిడార్లు నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. విశాఖ మెట్రో పైవంతెనలు, భాగర్భం కలిసి ఉంటుందని శ్రీధరన్ చెప్పారు.
మెట్రో ప్రాజెక్టును భారంగా మార్చబోమని, ప్రభుత్వంపై భారం పడకుండా చూస్తామని, ఖర్చు మొత్తాన్ని మెట్రో సమకూర్చుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆయన చెప్పారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టును మూడు నాలుగేళ్లలో పూర్తి చేస్తామని ఆయన చెప్పారు.
ఢిల్లీ నుంచి తమ ఇంజనీర్ల బృందం వచ్చి ఆ ప్రాంతాన్ని సమగ్రంగా పరిశీలిస్తుందని చెప్పారు. ఈ రోజు, రేపు సాంకేతిక, ఆర్థికాంశాలను పరిశీలిస్తామని ఆయన చెప్పారు. విశాఖ మహానగర పాలక సంస్థ అధికారులతో మెట్రో రైలు ప్రాజెక్టుపై శ్రీధరన్ బృందం సమీక్ష జరిపింది.