కోరిక తీర్చలేదని ఎంత పనిచేశారంటే?: మహిళా ఉద్యోగి కన్నీరుమున్నీరు..
కోరిక తీర్చలేదన్న అక్కసుతో లేనిపోనివి కల్పించి రికార్డులు తారు మారు చేసి ఆమె ఉద్యోగం పోయేలా చేశారు.
విజయనగరం: ఫీల్డ్ అసిస్టెంటుగా పనిచేస్తున్న ఓ మహిళను ఉన్నతాధికారి లైంగికంగా వేధించిన ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. వేధించడమే కాదు, తన కోరిక తీర్చనందుకు ఆ మహిళా ఉద్యోగిని ఏకంగా ఉద్యోగం నుంచే తొలగించడం గమనార్హం.
పేద కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఆ మహిళ.. సదరు ఉన్నతాధికారి తీరు పట్ల నిస్సహాయంగా రోధిస్తోంది. తన ఉద్యోగం తోనే పొట్ట పోసుకునే ఆ కుటుంబం ఇప్పుడు దిక్కులేని స్థితిలో ఉంది.
వాణిశ్రీ నేపథ్యం
విజయనగరం జిల్లా జామి మండలం, లొట్లపల్లి గ్రామానికి చెందిన జన్నెల వాణిశ్రీది నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. ఐదుగురు ఆడపిల్లల్లో వాణిశ్రీ చిన్నమ్మాయి.
కట్నం ఇచ్చే స్థోమత లేక తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి కూడా చేయలేదు. ఆ తర్వాత ఉద్యోగంలో చేరినా.. వాణిశ్రీ పెళ్లి చేసుకునే ఆలోచనను విరమించకున్నారు.
ఇంటర్ వరకు చదివిన వాణిశ్రీ నాలుగేళ్ల పాటు గ్రామంలోనే కూలి పనులకు వెళ్లారు. 2006లో ఉపాధి హామీ పథకం కింద ఫీల్డ్ అసిస్టెంట్గా ఉద్యోగంలో చేరారు. అప్పటి నుంచి మరో వ్యాపకం లేకుండా అంకితభావంతో విధులను నిర్వర్తిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో 2008-09 సంవత్సరాల్లో వాణిశ్రీ తల్లిదండ్రులు కాలం చేశారు.
కోరిక తీర్చమని:
వాణిశ్రీకి పెళ్లి కాలేదన్న విషయం తెలిసి ఉన్నతాధికారి ఒకరు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. పలుమార్లు ఆమెను లొంగదీసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ.. ఆమె మాత్రం తాను అలాంటి దానిని కాదని తెగేసి చెప్పింది. దీంతో సదరు అధికారి ఆమెపై పీకల్లోతు కక్ష పెంచుకున్నారు.
ఉద్యోగం నుంచి తొలగింపు:
కోరిక తీర్చలేదన్న అక్కసుతో లేనిపోనివి కల్పించి రికార్డులు తారు మారు చేసి ఆమె ఉద్యోగం పోయేలా చేశారు. ఈ నెల 16వ తేదీన ఉద్యోగంలోంచి తొలగించారు. ఉద్యోగం కావాలంటే కోరిక తీర్చాలి లేదా రూ.30వేలు లంచమైనా ఇవ్వాలి అని ఆ అధికారి డిమాండ్ చేసినట్టు ఆమె వాపోతున్నారు. ఉన్నతాధికారి తీరుతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. న్యాయం కోసం డ్వామా పీడీకి, జిల్లా కలెక్టర్కు నేరుగా ఫిర్యాదుచేసినా ఫలితం లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు.
వాణిశ్రీ మాటలు అవాస్తవమంటున్న అధికారి:
మరోవైపు వాణిశ్రీ మాటల్లో ఏమాత్రం వాస్తవం లేదని, ఆమె చేస్తున్న ఆరోపణలు అవాస్తవం అని, ఆమెను ఏరకంగా వేధించలేదని ఉపాధి హామి ఏపీవో పి.కామేశ్వరరావు చెబుతున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఆమె పని పోయిందన్నారు. రికార్డులు కూడా సక్రమంగా నిర్వహించడం లేదని, ఆమెను తొలగించడానికి ఇంకా చాలా కారణాలున్నాయని అంటున్నారు. ఆమె స్థానంలో ఎవరో ఒకరితో పని చేయించుకోవాలి కాబట్టి వేరొకరిని నియమించుకున్నామని అన్నారు.
ఫిబ్రవరి నుంచి వాణిశ్రీ విధులకు హాజరుకావడం లేదని, దీనిపై విచారణ జరిపి విధుల నుంచి తొలగిస్తున్నట్టు ఆదేశాలు జారీ చేశామని క్లస్టర్ ఏపీడీ శ్రీహరి అన్నారు.