ఏపీలో వరద అంచనాకు కేంద్ర బృందం ప్రకటన- వారంలోగా నివేదిక ఇవ్వాలని టార్గెట్
ఏపీలో తాజాగా కృష్ణా, గోదావరి నదులకు వచ్చిన వరదలతో భారీగా పంటనష్టం, ఆస్తినష్టం సంభవించాయి. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. ఇప్పటికే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరద పరిస్ధితులను సీఎం జగన్ ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. క్షేత్రస్దాయిలో అధికారులు కూడా వరద నష్టం అంచనా వేసే పనిలో ఉన్నారు.
వరదల కారణంగా భారీగా పంటనష్టం, ఆస్తినష్టం సంభవించినట్లు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం నుంచి నివేదికలు వెళ్లాయి. దీన్ని నిర్ధారించుకునేందుకు, వాస్తవ పరిస్ధితుల అధ్యయనానికి కేంద్ర హోంశాఖ ఓ ప్రత్యేక బృందాన్ని నియమించింది. ఈ బృందం త్వరలో రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్టాన్ని అంచనా వేయబోతోంది. నష్టాన్ని అంచనా వేసి వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కేంద్రం గడువు విధించింది. దీంతో కేంద్ర బృందం రాక కోసం రాష్ట్ర అధికారులు కూడా ఎదురుచూస్తున్నారు.
ఏపీలో వరద ప్రభావం అంచనాకు కేంద్రం ప్రకటించిన బృందానికి హోంశాఖ సంయుక్త కార్యదర్శి రాకేష్ కుమార్ నేతృత్వం వహిస్తున్నారు. ఆయనతో పాటు వ్యవసాయ, ఆర్ధిక, విద్యుత్, రోడ్డు రవాణా, గ్రామీణాభివృద్ధి, జల్శక్తి శాఖల నుంచి ప్రతినిధులు కూడా ఉంటారు. వారం రోజుల్లోగా వీరు క్షేత్రస్ధాయిలో పర్యటించి వివరాలను హోంశాఖ పరిధిలో ఉండే విపత్తుల నిర్వహణ విభాగానికి అందజేయాలని కేంద్రం తన ప్రకటనలో పేర్కొంది.