హోంశాఖ భేటీలో ఏపీకి కేంద్రం షాకులు- రైల్వే జోన్ పై హ్యాండ్సప్-రాజధాని నిధులకూ నో...
ఏపీ-తెలంగాణ విభజన సందర్భంగా తలెత్తిన సమస్యల పరిష్కారం చూపుతామంటూ ఇవాళ ఢిల్లీలో కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన భేటీ ఎలాంటి ఫలితం తేలకుండానే ముగిసింది. ఇవాళ సమావేశంలో ఏపీ, తెలంగాణ ఎప్పటిలాగే తమ తమ వాదనలకు కట్టుబడ్డాయి. అయితే వీరికి పరిష్కారం చూపడంలో కేంద్రం మరోసారి విఫలమైంది.
విభజన సమస్యల పరిష్కారంపై కేంద్ర హోంశాఖ నిర్వహించిన సమావేశంలో పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఇందులో ఏపీకి రైల్వే జోన్ తో పాటు రాజధానికి నిధులు, తెలంగాణ నుంచి బాకీలు ఇప్పించడం వంటివి ఉన్నాయి. అయితే ఏపీకి రైల్వే జోన్ ఇవ్వడం సాధ్యం కాదని.. ఈ అంశాన్ని కేంద్ర కేబినెట్కు వదిలేయాని హోంశాఖ సూచించింది. ఇప్పటికే రైల్వే జోన్ ఇచ్చేస్తున్నట్లు పలుమార్లు చెప్పిన కేంద్రం.. ఇప్పుడు మాత్రం సాధ్యం కాదని, కేంద్ర కేబినెట్ దీనిపై నిర్ణయం తీసుకుంటుందని చెప్పడంతో ఏపీకి షాక్ తప్పలేదు.
అలాగే రాష్ట్రంలో రాజధానికి మరో రూ.1000 కోట్లు కావాలని ఏపీ కోరింది. దీనిపై స్పందించిన కేంద్ర హోంశాఖ.. ఇప్పటికే ఇచ్చిన రూ.1500కోట్ల ఖర్చుల వివరాలను అడిగింది. వాస్తవానికి రాజధాని నిర్మాణానికి శివరామకృష్ణన్ కమిటీ నివేదికలో సూచించిన రూ.29వేల కోట్లు ఇవ్వాలని ఏపీ కోరింది. కానీ దీనిపై హోంశాఖ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.
అలాగే తెలంగాణ నుంచి రావాల్సిన బాకీలు, సంస్ధల విభజనపై ఏపీ లేవనెత్తిన ఏ అంశంలోనూ తెలంగాణ అంగీకారం తెలపలేదు. దీంతో విభజన సమస్యలపై మరోసారి ఎలాంటి స్పష్టత లేకుండానే ఈ ముగిసింది. మరో సమావేశం ఎప్పుడన్నది కూడా క్లారిటీ రాలేదు.