అమరావతికి రాకుండా...మధ్యాహ్న భోజన పథకం వర్కర్ల ముందస్తు అరెస్ట్
పశ్చిమ గోదావరి: డిమాండ్ల సాధన కోసం ఆందోళన బాటపట్టిన మధ్యాహ్న భోజన పధకం వర్కర్లు...అమరావతిలో నిరసన చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో వారి ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు.
సోమవారం అమరావతికి బయలుదేరేందుకు రైల్వేస్టేషన్కు చేరుకున్న పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మధ్యాహ్న భోజన పధకం వర్కర్లను పోలీసులు అరెస్ట్ చేసి, పాలకొల్లు పోలీస్ స్టేషన్లకు తరలించారు. అనంతరం కొద్దిసేపటికి విడుదల చేశారు. వీరితో పాటు నలుగురు సిఐటియు నాయకులను కూడా పోలీసులు ముందుగా అరెస్ట్ చేసి బెయిల్పై విడుదల చేశారు.
మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రయివేటు సంస్థలకు అప్పగించడాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్న భోజన పధకం వర్కర్లు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. గత సోమవారం ఆందోళనలో పాల్గొన్న మధ్యాహ్న భోజన పధకం కార్మికులను పోలీసులు అరెస్ట్ చేయగా ఆ అక్రమ అరెస్టులకు నిరసిస్తూ ఎపి మధ్యాహ్న భోజన పధకం కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్ వద్ద మంగళవారం రాస్తారోకో జరిగింది.
కార్మికుల ఆందోళన విషయమై వారి నాయకురాలు బి.సుధారాణి మాట్లాడుతూ 15 ఏళ్లుగా భోజన పథకం నిర్వహణ బాధ్యతలు చూస్తున్న మహిళలను కాదని ఈ పథకం నిర్వహణను ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు అప్పగించడం అన్యాయమన్నారు.
తమ పొట్టకొట్టొద్దంటూ న్యాయం కోసం పోరాడుతుంటే మహిళలని చూడకుండా దాడి చేసి తమను అరెస్టులు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం వెంటనే ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోవాలని, లేకపోతే 2019 ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని ఆమె హెచ్చరించారు.