వైద్యుడి అరెస్టుకు కలెక్టర్ ఆదేశం...గుంటూరులో కలకలం... భగ్గుమన్న నారా లోకేష్...
గుంటూరు జిల్లా నరసరావుపేటలో కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో కరోనా వ్యాప్తిపై ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశం వాడి వేడిగా సాగింది. సమావేశంలో కరోనా పేషెంట్లకు అందుతున్న వైద్య సదుపాయాలపై కలెక్టర్ స్థానిక వైద్య అధికారుల నుంచి వివరాలు కోరారు. అయితే అధికారుల స్పందనపై ఆయన పెదవి విరిచారు.
కరోనా వ్యాప్తికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా... కేసుల సంఖ్య ఎందుకు పెరుగుతోందని కలెక్టర్ అధికారులను ప్రశ్నించారు. వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలేవైనా ఉంటే చెప్పాలన్నారు. దీంతో నాందెడ్ల ప్రైమరీ హెల్త్ సెంటర్లో పనిచేస్తున్న డా.సోములు నాయక్ లేచి... 'కరోనా నియంత్రణ కోసం మేము శాయాశక్తులా కృషి చేస్తున్నాం. అయినప్పటికీ అధికారులు మాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.' అని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో కరోనా నియంత్రణకు తాను ఎంతగా కృషి చేస్తున్నా.. తనకెటువంటి గుర్తింపు దక్కడం లేదన్నారు. తమ కష్టానికి కచ్చితంగా గుర్తింపు దక్కాలన్నారు.
డా.సోములు నాయక్ సమాధానంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ శామ్యూల్ ఆనంద్.. ఆయన్ను తక్షణం విధుల్లో నుంచి తొలగించాల్సిందిగా అక్కడే ఉన్న డీఎంహెచ్వో జే.యాస్మిన్ను ఆదేశించారు. అంతేకాదు,ఆయన్ను అరెస్ట్ చేయాలని డీఎస్పీ వీరా రెడ్డికి ఆదేశాలిచ్చారు. దీంతో పోలీస్ అధికారులు ఆయన్ను సమావేశం నుంచి డీఎస్పీ కార్యాలయానికి తరలించారు.
నరసరావుపేట టౌన్ హాల్లో ఈ సమావేశం జరిగింది. తాజా ఘటనపై డీఎస్పీ వీరారెడ్డి మాట్లాడుతూ... డా.సోములు నాయక్పై ఇంతవరకూ ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు. ఫిర్యాదు అందిన తర్వాతే ఆయనపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మరోవైపు ఈ వివాదం రాజకీయ రంగు పులుముకుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 'గిరిజన అధికారిపై జగన్ రెడ్డి ప్రభుత్వ దౌర్జన్యకాండ.నరసారావుపేట సమీక్ష సమావేశంలో... కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా కేసులు పెరుగుదలకు మమ్మల్ని నిందించడమేంటని ప్రశ్నించిన నాదెండ్ల వైద్యాధికారి సోము నాయక్ను చులకన చేసి మాట్లాడటమే కాకుండా... అరెస్ట్ చేయడం దారుణం. అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. వెంటనే ఆయన్ను విడుదల చేయాలి.' అని డిమాండ్ చేశారు. దీనిపై ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది వేచి చూడాలి.
Recommended Video
గిరిజన అధికారిపై జగన్ రెడ్డి ప్రభుత్వ దౌర్జన్యకాండ. గుంటూరు జిల్లా నరసరావుపేటలో కరోనా పై జరిగిన సమీక్షా సమావేశంలో కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా కేసులు పెరుగుదలకు మమ్మల్ని నిందించడం ఏంటి అని ప్రశ్నించిన నాదెండ్ల వైద్యాధికారి సోమ్లూ నాయక్ గారిని చులకన చేసి మాట్లాడటమే కాకుండా... pic.twitter.com/CwFlO5bQTx
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) September 10, 2020