చిత్తూరు నుండి యూపీకి కాలినడకన వలసజీవుల ప్రయాణం .. అడ్డుకుని క్వారంటైన్ కు తరలింపు
బతుకు దెరువు కోసం వలస వెళ్ళిన కార్మికులు కరోనా కష్ట కాలంలో కుటుంబాల చెంతకు చేరుకోవాలని ఆరాటపడుతున్నారు. ఒకపక్క పనుల్లేకపోవటం, కుటుంబ సభ్యుల ఆందోళన వెరసి తమ వారి కోసం నడక మొదలుపెట్టారు. దేశమంతా వలస జీవుల కష్టాలు ఇలాగే ఉన్నాయి. కాలి నడకన వెళ్తున్నా అడుగడుగునా అడ్డుకుంటున్న పోలీసులు వారిని క్వారంటైన్ కు తరలిస్తున్నారు . దీంతో వారు లబోదిబోమంటున్నారు .
Recommended Video
'విడిచిపెడితే నడిచి నేను పోతా సారూ' .. మనసును మెలిపెడుతున్న వలస జీవుల వెతలపై పాట
చిత్తూరు జిల్లా నుండి యూపీకి కాలినడకన ప్రయాణం సాగించిన వలస జీవులు
ఇక తాజాగా ఉత్తరప్రదేశ్కు చెందిన పది మంది యువకులు చిత్తూరుకు వచ్చారు. ఇక వారు చిత్తూరు జిల్లాలో ఐస్ బండ్లు నడుపుకుంటూ రెండేళ్లుగా జీవనం సాగిస్తున్నారు. వారంతా 20 ఏళ్లలోపు వయసున్న యువకులు . ఇప్పుడు కరోనా లాక్ డౌన్ తో వారికి పనుల్లేవు . వీరి బతుకుల్లో కరోనా చిచ్చు రేపింది . లాక్డౌన్తో ఇప్పట్లో వ్యాపారాలకు అనుమతులు ఇచ్చే అవకాశం లేదని యజమానులు చెప్పడంతో పొట్ట చేతబట్టుకుని పని కోసం వచ్చిన వారు ఎలాగైనా ఇంటికి చేరుకోవాలని భావించారు . ఎలాగైనా సొంతూళ్లకు చేరాలనుకున్న వారు బస్సులు, బండ్లు వంటి వాహన సదుపాయాలు అందుబాటులో లేకపోయినా సరే కాలినడకన వెళ్లాలని సాహసం చేశారు .
రోజుకు 110 కిలోమీటర్లు చొప్పున నాలుగు రోజులు ప్రయాణం చేసిన కార్మికులు
చిత్తూరు నుంచి ఉత్తరప్రదేశ్ చేరుకోవాలంటే మొత్తం 1900 కిలోమీటర్లు ప్రయాణించాలని తెలిసినా కాలికి పని చెప్పారు . ఆదివారం సాయంత్రం చిత్తూరు నుంచి బయల్దేరి ప్రయాణం మొదలు పెట్టారు . అసలే ఎండాకాలం మార్గమధ్యలో కనీసం భోజనం చేసే పరిస్థితులు కూడా లేకపోవడంతో ఎవరైనా భోజనం ప్యాకెట్లు పంపిణీ చేస్తుంటే వాటిని తీసుకుంటూ నాలుగు రోజులుగా వారు తమ వారిని కలవాలనే ఆశతో జీవన యానం సాగిస్తున్నారు . మొత్తంగా మూడు రోజుల్లో 331 కిలోమీటర్లు అంటే సరాసరిన రోజుకు 110 కిలోమీటర్లు ప్రయాణం సాగించారు .
ఒంగోలు మండలం త్రోవగుంట సమీపంలో పట్టుకుని క్వారంటైన్ కు తరలింపు
ఒంగోలు మండలం త్రోవగుంట సమీపంలో హైవే మీదుగా వస్తుండగా వారిని అక్కడ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్తున్నారు అని ప్రశ్నించి వారు చెప్పిన సమాధానం విని షాక్ అయ్యారు . ఉత్తర ప్రదేశ్ కు వెళ్తున్నారని తెలిసి వారికి అంత దూరం ఈ సమయంలో ప్రయాణం మంచిది కాదని చెప్పారు . వారంతా ఆహారం లేక నీరసించి ఉండటంతో వారికి భోజనం పెట్టారు. అనంతరం వారికి పరిస్థితులు వివరించి అందరినీ పేస్ ఇంజినీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన క్వారంటైన్కు తరలించారు. దీంతో వాళ్ళు తమ వారిని చేరుకోలేకపోతున్నామని తీవ్ర ఆవేదన చెందుతున్నారు . వారికి అన్నం పెట్టినా , వసతి కల్పించినా తమ కుటుంబంతో ఉన్నట్టు కాదని తమను వెళ్ళనివ్వాలని ప్రాధేయపడుతున్నారు.