ఏపీలో వలస కార్మికుల తరలింపు చర్యలు మృగ్యమేనా ? తిరుగుబాటు అందుకేనా ?
కరోనా కాలంలో విధించిన లాక్ డౌన్ తో దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్న వలస కార్మికులు , ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న విద్యార్థులు, యాత్రికులను సొంత గ్రామాలకు చేర్చాలని కేంద్రం మార్గదర్శకాలను ఇచ్చినా ఏపీలో అధికారుల పని తీరు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది .అయిన వారికి దూరంగా , తినటానికి తిండి, తల దాచుకోవటానికి నీడ లేని పరిస్థితిలో కుటుంబాలకు దూరంగా కన్నీటి పర్యంతం అవుతున్న వలస కార్మికులు తమ సొంత ఊర్లకు వెళ్లాలని, అధికారులు తమని ఎలాగైనా పంపాలని వేడుకుంటున్నారు .
తొలిరైలు తెలంగాణా నుండే ..సంతోషంగా సొంత ఊర్లకు ..మొదలైన వలసకార్మికుల తరలింపు
మంగళగిరి , నెల్లూరులలో వలస కార్మికుల ఆందోళన
ఏపీలో చాలా మంది ఇతర రాష్ట్రాల ఉపాధి కూలీలు కరోనా లాక్ డౌన్ తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక కేంద్ర సర్కార్ వారందరినీ తరలించాలని మార్గదర్శకాలను ఇచ్చినప్పటికీ ఆ ప్రయత్నాలు సాగటం లేదు. దీంతో ఆగ్రహించిన వలస కూలీలు తిరుగుబాటు చేస్తున్నారు . తమను స్వస్థలాలకు పంపడంలేదంటూ వలస కార్మికులు కృష్ణా జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్, నెల్లూరు జిల్లా షార్లో ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో అక్కడ పరిస్థితి అదుపుతప్పింది. పోలీసులు లాఠీలకు పనిచెప్పి వారిని అడ్డుకున్నారు .
పోలీసులపై రాళ్ళ దాడి .. పోలీసుల లాఠీ చార్జ్
మంగళగిరి ఎయిమ్స్ నిర్మాణ పనుల్లో ఉత్తరప్రదేశ్, బీహార్, ఒరిస్సా, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు చెందిన సుమారు మూడు వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. లాక్డౌన్తో పనులు నిలిచిపోవడంతో తమను స్వస్థలాలకు పంపించాలని వారు కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఇక కేంద్రం కూడా ఆదేశాలు ఇవ్వటంతో వారు అధికారుల మీద ఒత్తిడి తెస్తున్నారు. ఇక అధికారులు రేపు, ఎల్లుండి అని తాత్సారం చెయ్యటంతో వారు ఆగ్రహించి వారు పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టారు. అడ్డుకున్న పోలీసులపై రాళ్ళు రువ్వారు. ఇక పోలీసుల లాఠీ చార్జ్ తో వారిని అడ్డుకున్నారు.
నెల్లూరులోనూ అదే సీన్ .. అధికారులను ప్రాదేయపడుతున్న కూలీలు
ఇక నెల్లూరు జిల్లాలో కూడా జార్ఖండ్ కు సంబంధించిన వలస కూలీలు ఆందోళన బాట పట్టారు. షార్ కేంద్రంలో పని చేసే కూలీలు తమని పంపించాలని ఆందోళన చేశారు. ఇక అడ్డుకున్న పోలీసులపై రాళ్ళు రువ్వటంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసి మరీ కంట్రోల్ చేశారు. కేంద్రం ఇచ్చిన సడలింపులతో పలువురు తమ స్వరాష్ట్రాలకు, జిల్లాలకు ఎలాగో ఒకలా వెళ్తున్నప్పటికీ , మరికొందరు అధికారుల పట్టింపు లేని తనంతో ఇంకా వేరే ప్రాంతాల్లోనే ఉండిపోతున్నారు. ఎలా వెళ్లాలో తెలియక అవస్థలు పడుతున్నారు. ఇదే క్రమంలో వివిధ జిల్లాలకు చెందిన కొందరు వలసకూలీలు శనివారం ఉదయం తెనాలి తహసీల్దార్ను కలిసి తమ ఆవేదనను తెలియజేశారు.
తరలింపుపై స్పందించని అధికారులు .. తీవ్ర ఆవేదనలో కూలీలు
ఇంతగా ప్రతి జిల్లాలో వలస కార్మికులు , ఇతర ప్రాంతాలకు వెళ్లి చిక్కుకున్న వాళ్ళు అవస్థలు పడుతున్నా అధికారులు పెద్దగా పట్టింపు లేనట్టు వ్యవహరించటమే తాజా తిరుగుబాతులకు కారణం అవుతుంది. ఒక పక్క కేంద్రం పర్తి రాష్ట్రంలోనూ జిల్లాల వారీగా ఉన్న వలస కార్మికులను తరలించాలని చెప్పినా ఇంకా ఏపీలో చాలా జిల్లాలలో వలస కార్మికులు తమ సొంత ఊర్లకు వెళ్ళే మార్గం కోసం నిరీక్షిస్తున్నారు. అధికారులను పదేపదే వేడుకుంటున్నారు. తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు.