వైసీపిలోకి వలసలు..! జన సంద్రంగా మారిన లోటస్ పాండ్..!!
హైదరాబాద్ : ఎన్నికలు సమీపిస్తుండటంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికల ప్రవాహం కూడా జోరందుకుంది. వైసీపి అధినేత వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే నాయకుల సంఖ్య రోజుకు రోజుకు పెరుగుతోంది. తాజాగా విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. లోటస్పాండ్లో తనను కలిసిన దాడి వీరభద్రరావు, ఆయన తనయుడు రత్నాకర్ను పార్టీ కండువాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. ఎంపీ విజయసాయిరెడ్డి, అవంతి శ్రీనివాసరావు తదితరులు అక్కడ ఉన్నారు. విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సతీశ్ వర్మ కూడా వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దేవరపల్లి ఎంపీపీ, ఇతర నాయకులు కూడా వైఎస్సార్సీపీలోకి వచ్చారు.
ఎంపీగా పోటీ చేయలేను : సీయంతో మాగుంట చెప్పిన కారణమేంటి : టిడిపి ఎంపీలకు ఏమైంది..!
సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు ఇవాళో రేపో వెలువడుతుం దనుకుంటున్న తరుణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల వెల్లువ మరింత ఊపందుకుంది. గన్నవరం టీడీపీ మాజీ ఎమ్మెల్యే దాసరి వెంకట బాలవర్ధనరావు, కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయవేత్త చల్లా రామకృష్ణారెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త ఎంఎంఆర్ గ్రూపు సంస్థల చైర్మన్ మన్నెం మధుసూదనరావు, నంద్యాలకు చెందిన పారిశ్రామికవేత్త పోచా బ్రహ్మానందరెడ్డితో సహా పలువురు సినీ కళాకారులు శుక్రవారం పార్టీలో చేరారు.
ఈ చేరికలతో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నివాసం, పార్టీ కార్యాలయం సందడిగా మారింది. వీరంతా వేర్వేరు సమయాల్లో జగన్ను ఆయన నివాసంలో కలుసుకుని పార్టీలో చేరాలన్న తమ అభీష్టాన్ని వెల్లడించగా ఆయన వారికి కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు.