Earthquake: కృష్ణా, గుంటూరు జిల్లాలు సహా తెలంగాణలో భూప్రకంపనలు: తీవ్రత ఎలా ఉందంటే.. ?
రెండు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి భూప్రకంపనలు సంభవించాయి. ఏపీలోని కృష్ణా, గుంటూరు, తెలంగాణలోని ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో భూప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.7గా నమోదైనట్లు తెలుస్తోంది. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత 2:30 గంటల సమయంలో భూమి కంపించింది. ఆరు సెకెన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. ఈ భూప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. దీనితో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఏపీ, తెలంగాణ సరిహద్దు జిల్లాల్లోని నాగులవంచ, బస్వాపురం, పాతర్లపాడు, చందర్లపాడు, కంచికచర్ల, వీరులపాడు, జగ్గయ్యపేట, నందిగామ, కోదాడ, హుజూర్ నగర్, చింతకాని వంటి చోట్ల భూకంపం సంభవించింది. దీని తీవ్రతకు కొన్ని గ్రామాల్లో రోడ్లపై చీలికలు ఏర్పడ్డాయి. కొన్ని నివాసాల్లో గోడలకు బీటలు ఏర్పడ్డాయి. దీనితో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. తమ ఇళ్లల్లో నుంచి బయటికి పరుగులు తీశారు. చలిలోనూ ఆరు బయటే కంటి మీద కునుకు లేకుండా గడిపారు.
కృష్ణా, గుంటూరు, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలు భూకంపం బెల్ట్లోనే ఉన్నాయంటూ ఇదివరకే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయినప్పటికీ.. ఈ మధ్యకాలంలో భూమి ప్రకంపించిన దాఖలాలు లేవు. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత సంభవించిన ప్రకంపనలు స్థానికులను భయాందోళనలకు గురి చేశాయి. భూకంప తీవ్రత చాలా తక్కువగా ఉందని, భయపడాల్సిన అవసరం లేదని అధికారులు భరోసా ఇస్తున్నారు.