సైకిల్ యాత్రలో అపశ్రుతి: టీడీపీ ఎంపీ మాగంటి బాబుకు గుండెపోటు!
ఏలూరు: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండుతో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు సైకిల్ యాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సైకిల్ యాత్రల్లో వరుసగా అపశ్రుతులు దొర్లుతూ వస్తున్నాయి. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా చింతల పూడిలో సైకిల్ యాత్రలో పాల్గొన్న టీడీపీ ఎంపీ మాగంటి బాబు సొమ్మసిల్లి పడిపోయారు.
వెంటనే అప్రమత్తమైన కార్యకర్తలు ఆయన్ను ఏలూరులోని ఆసుపత్రికి తరలించారు. మాగంటి బాబుకు ప్రాథమికి చికిత్స అందించామని, స్వల్ప గుండెపోటుకు గురవడం వల్లే సొమ్మసిల్లి పడిపోయారని వైద్యులు తెలిపారు. కాసేపట్లో ఆయన్ను విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
కాగా, టీడీపీ సైకిల్ యాత్రలో ఇటీవలే స్పీకర్ కోడెల శివప్రసాద్ కూడా స్వల్పంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. యలమందల వద్ద సైకిల్ తొక్కుతూ స్పీకర్ కిందపడిపోవడంతో ఆయనకు తలకు గాయాలయ్యాయి. అయినా సరే, స్పీకర్ వాటిని లెక్కచేయకుండా సైకిల్ యాత్రను కొనసాగించారు.