ఏపీ మున్సిపల్ ఎన్నికల బరిలో ఎంఐఎం .. టీడీపీకి చెక్ పెట్టే వైసీపీ వ్యూహమేనా ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోరు కొనసాగుతోంది . ఈ మున్సిపల్ ఎన్నికలలో ఆసక్తికర పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఏపీలో మున్సిపల్ ఎన్నికల్లో ఊహించని విధంగా ఎంఐఎం పార్టీ ఎంట్రీ ఇవ్వడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
Recommended Video
గత సాధారణ ఎన్నికలలో చంద్రబాబుని టార్గెట్ చేసిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని పేర్కొన్నారు. అందులో భాగంగా వైసిపికి మద్దతును ప్రకటించి మైనారిటీ ఓటు బ్యాంక్ ను వైసిపికి మళ్లేలా చేశారు. ఇక ఇప్పుడు ఏకంగా ఏపీలో ఎంట్రీ ఇచ్చి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.
ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో దూకుడు పెంచిన టీడీపీ ...ప్రచార బరిలోకి చంద్రబాబు
ఎంఐఎం ఎంట్రీ వెనుక అధికార వైసీపీ వ్యూహం ఉందని చర్చ
విజయవాడ, కర్నూలు కార్పొరేషన్లలో, ప్రొద్దుటూరు మున్సిపాలిటీ లో ఎంఐఎం పార్టీ నామినేషన్లు దాఖలు చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎంఐఎం ఎంట్రీ వెనుక అధికార వైసీపీ వ్యూహం ఉందని ఏపీ రాజకీయాల్లో చర్చ నడుస్తుంది.
విజయవాడలోని 50, 54 డివిజన్లలో ఎంఐఎం అభ్యర్థులు పోటీలో ఉన్నారు .అలాగే కర్నూలు, ప్రొద్దుటూరు లలోనూ ఎన్నికల బరిలోకి దిగిన ఎంఐఎం అభ్యర్థుల కోసం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రచారం చేయాలని నిర్ణయించారు. అంతేకాదు హిందూపురంలో టిడిపికి వ్యతిరేకంగా ఎంఐఎం పార్టీ ముఖ్యులు పర్యటించి ప్రచారం చేయాలని భావిస్తున్నారు.
టీడీపీ బలంగా ఉన్న స్థానాల్లోనే ఎంఐఎం పోటీ .. పార్టీ ముఖ్య నేతల ప్రచారం
విజయవాడలోని 50, 54 డివిజన్లలో బరిలోకి దిగిన ఎంఐఎం అభ్యర్థుల కోసం నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ ప్రచారం చేస్తున్నారు. ముస్లిం పెద్దలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
రాష్ట్రంలోని ఎక్కడైతే మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో వైసీపీ బలహీనంగా ఉందని భావిస్తుందో , ఆయా స్థానాలలో మైనారిటీ ఓటు బ్యాంకు ఉన్న చోట ఎంఐఎం రంగంలోకి దింపి వైసిపి వ్యూహాత్మక ఎత్తుగడ వేసిందని చర్చ జరుగుతుంది. ఏపీలో టీడీపీకి వైసీపీకి హోరాహోరీగా పోరు ఉన్న స్థానాలలో ఎంఐఎం నాయకులు ఎన్నికల బరిలోకి దిగినా వైసీపీ నేతలు నోరు మెదపకపోవడం అందుకు కారణం గా కనిపిస్తుంది.
ఓటు బ్యాంకు చీల్చెందుకే ... వైసీపీ , ఎంఐఎం రాజకీయంపై టీడీపీ మల్లగుల్లాలు
రాజధాని అమరావతి ప్రభావం ఉన్న విజయవాడ , గుంటూరు తదితర నగరాలపై టిడిపి పట్టు కొనసాగుతుందని భావిస్తున్న నేపథ్యంలో టిడిపి ఓటు బ్యాంకును చీల్చితే తమకు విజయం సులభం అవుతుందని భావించిన వైసిపి, ఓటు బ్యాంకు చీలిక కోసం ఎంఐఎంని రంగంలోకి దించింది అని చర్చ జరుగుతుంది. వైసీపీకి ప్రతికూల పరిస్థితులు ఉన్న చోట మాత్రమే ఎంఐఎం ఎన్నికల బరిలోకి దిగింది అని టిడిపి నేతలు ఏపీలో ఎంఐఎం పోటీపై మల్లగుల్లాలు పడుతున్నారు.