ఆయన మోడీ కాదు మొండిదేవుడు: మంత్రి ఆది తీవ్ర విమర్శలు
జమ్మలమడుగు: ప్రధానమంత్రి నరేంద్రమోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి ఆదినారాయణ రెడ్డి. శుక్రవారం ఉదయం మైలవరం జలాశయాన్ని సందర్శించిన సందర్భంగా.. మోడీని మొండిదేవుడు అంటూ విమర్శలు చేశారాయన. ఇప్పటికైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
టీడీపీ బీజేపీకి మిత్ర పక్షమైనా నాలుగు సంవత్సరాలపాటు కలిసి మెలసి ఉన్నా రాష్ట్రాభివృద్దికి ఏమాత్రం సహకరించలేదని ఆరోపించారు. విభజన చట్టంలో పొందుపరిచిన 19అంశాలను అమలుపరచడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు.
పట్టిసీమ పూర్తికావడంతోనే కృష్ణనది నుంచి గండికోటకు, మైలవరం జలాశయాలకు నీటిని తీసుకురాగలిగామని తెలిపారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా మైలవరానికి 4, గండికోటలో ఆరు టీఎంసీల నీరు వచ్చి చేరిందన్నారు.
పెన్నానది పరివాహక 100గ్రామాలకు మూడు మున్సిపాలిటీల ప్రజలకు తాగునీరు విడుదల చేయాలని సీఎంను కోరామని, ఆయన సూచనమేరకే మైలవరం జాలాలను విడుదల చేయించామని అన్నారు.
Recommended Video
కాగా, మ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్నాయుడు, పౌరసరఫరాల శాఖ చైర్మన్ మల్లేల లింగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిలతో కలసి మైలవరం నుంచి పెన్నానదికి ఆయన నీటిని విడుదల చేశారు.
రోజుకు 1000 క్యూసెక్కుల చొప్పున 11 రోజుల పాటు పెన్నానదికి విడుదల చేస్తామని ఆది తెలిపారు. మైలవరం జలాశయానికి సంబంధించిన ఉత్తర,దక్షిణ కాలువలను త్వరగా పూర్తి చేస్తామని హామి ఇచ్చారు. అవి పూర్తయితే చివరి ఆయకట్టు రైతులకు నీరు అందించడానికి ఉపయోగపడుతుందని అన్నారు.