దుష్టశక్తులు.. పథకం ప్రకారమే అల్లర్లు సృష్టిస్తున్నారు: కోనసీమ ఉద్రిక్తతపై మంత్రి ఆదిమూలపు సురేష్
కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లాగా మార్చడం పై కోనసీమ సాధన సమితి ఆధ్వర్యంలో ఆందోళనలు ఒక్కసారిగా ఉద్రిక్తతలకు దారితీసాయి. ఊహించని విధంగా మంత్రి పినిపే విశ్వరూప్ ఇంటిపై ఆందోళనకారులు దాడికి దిగి ఇంటిని తగులబెట్టారు. అదే విధంగా ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటిపై కూడా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై వైసిపి నేతలు, మంత్రులు సీరియస్ అవుతున్నారు. ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన రెండూ కలిసి దాడులకు ప్లాన్ చేసినట్లుగా ఆరోపణలు గుప్పిస్తున్నారు.
ఇప్పటికే హోం మంత్రి తానేటి వనిత జనసేనను, టిడిపిని అదృశ్య శక్తులు అంటూ టార్గెట్ చేసి విమర్శలు గుప్పించగా, తాజాగా మంత్రి ఆదిమూలపు సురేష్ కోనసీమలో చోటుచేసుకున్న విధ్వంస ఘటనలపై మండిపడ్డారు. కొన్ని దుష్ట శక్తులు రాష్ట్రంలో ఉద్దేశపూర్వకంగా అల్లర్లు సృష్టించాలని చూస్తున్నాయి అంటూ ఆరోపించారు మంత్రి ఆదిమూలపు సురేష్. ఒక జిల్లాకు రాజ్యాంగ నిర్మాత అయిన మహానుభావుడు అంబేద్కర్ పేరు పెట్టడం వల్ల ఈ ప్రభుత్వం ఆయనకు గొప్ప గౌరవాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.
అంబేద్కర్ ఒక కులానికో వర్గానికో చెందిన వారు కాదని, అంబేద్కర్ అందరివాడు అని వ్యాఖ్యానించారు. అంబేద్కర్ పేరు పెట్టడంపై అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని వర్గాల సూచన, కోరిక మేరకే అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చడం జరిగిందని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.తాజాగా కోనసీమ జిల్లాలో చోటు చేసుకున్న పరిస్థితులను చూస్తే పథకం ప్రకారమే అల్లర్లు సృష్టించాలన్న ఎత్తుగడలో భాగంగా కనిపిస్తున్నాయి అంటూ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.
కోనసీమ జిల్లా లో 144 సెక్షన్ కొనసాగుతుందని, అమలాపురంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని, పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం జరుగుతుందని పేర్కొన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. మంత్రి విశ్వరూప్, ఇతర ప్రజాప్రతినిధుల ఇళ్లపై అల్లరి మూకల దాడిని ఖండిస్తున్నామని పేర్కొన్న ఆయన ఈ అల్లర్ల వెనుక ఎవరున్నారో వారిని బయటకు లాగుతాం అంటూ స్పష్టం చేశారు.