మోడీని విమర్శించే స్థాయి నాకులేదు, ఆళ్లగడ్డను బాబు చేతిలో పెడతా, ఆయనిష్టం: అఖిలప్రియ
కర్నూలు: ప్రధాని నరేంద్ర మోడీపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, తెలుగుదేశం పార్టీ నేత, మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. ప్రధానిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన అఖిలపై చర్యలు తీసుకోవాలని, కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఏపీ బీజేపీ నేతలు ఇటీవల గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె మరోసారి స్పందించారు.
ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు, కట్టుబడి ఉన్నానంటూ
ప్రధానిపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. ప్రధానిపై వ్యక్తిగతంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. దేశంలో మహిళలకు, బాలికలు రక్షణ లేదన్నారు. మహిళా సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు పాటుపడుతుంటే, మోడీ మాత్రం మహిళలపై దాడులు, అత్యాచారాలు చేయమంటూ రెచ్చగొడుతున్నారని ఆమె ఇటీవల అన్నారు. మోడీ ప్రభుత్వం మహిళలు బయటకు రాలేని పరిస్థితి తెచ్చిందన్నారు.
ప్రధానిని వ్యక్తిగతంగా విమర్శించే స్థాయిలేదు
తనను మంత్రి వర్గం నుంచి తప్పించాలని బీజేపీ నేతలు గవర్నర్ను కలవడంలో అర్థం లేదని అఖిలప్రియ అన్నారు. మోడీపై వ్యక్తిగతంగా మాట్లాడలేదన్నారు. దేశంలో మహిళలకు, బాలికలకు రక్షణ లేదని, అదే విషయాన్ని ఓ మహిళగా, మంత్రిగా చెబుతున్నానని చెప్పారు. ప్రధానిని వ్యక్తిగతంగా విమర్శించే స్థాయి తనకు లేన్నారు.
బీజేపీ ఎందుకు మాట్లాడటంలేదు
ప్రస్తుతం దేశంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితుల గురించే తాను మాట్లాడానని అఖిలప్రియ అన్నారు. ఉత్తరప్రదేశ్లో ఏకంగా ఓ ఎమ్మెల్యే పైనే అత్యాచార ఆరోపణలు వచ్చాయని తెలిపారు. వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలన్నారు. బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలన్నారు.
పార్టీ మార్పుపై స్పష్టత
తాను తెలుగుదేశం పార్టీ వీడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై అఖిలప్రియ మండిపడ్డారు. ఆ వార్తలను కొట్టి పారేశారు. తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచే పోటీ చేస్తానని చెప్పారు. ఆళ్లగడ్డ సీటును ముఖ్యమంత్రి చంద్రబాబు చేతిలో పెడతానని, ఆయన ఇష్టమని చెప్పారు.