వైసీపీ నేతకు మంత్రి అఖిలప్రియ కాంట్రాక్టులు:అదే ఆ ఎమ్మెల్యేకు సమస్య!
అమరావతి:మంత్రి అఖిలప్రియని ఎప్పుడూ వివాదాలు వెంటాడుతూనే ఉంటాయి...నిన్నటివరకు ఎ వి సుబ్బారెడ్డితో విభేదాలతో వార్తల్లో నిలిచిన అఖిల ప్రియ తాజాగా బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డి కారణంగా సిఎం చంద్రబాబుకు వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఎదురైంది.
బనగానపల్లె ఎమ్మెల్యే బిసి జనార్థన రెడ్డి తొలుత టిడిపి మహానాడుకు...ఆ తరువాత ఏకంగా సిఎం చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటనకు గైర్హాజరు కావడంతో స్వయంగా చంద్రబాబే పూనుకొని ఈయన అసంతృప్తికి కారణాలు తెలుసుకున్నారు. అయితే బిసి జనార్థన్ రెడ్డి అసంతృప్తికి కూడా కారణం మంత్రి అఖిల ప్రియేనని తెలిసి చంద్రబాబు ఆశ్చర్యపోయినట్లు తెలిసింది. ఎమ్మెల్యే బిసి జనార్థన రెడ్డి అసంతృప్తికి కారణాలు ఇవేనని ప్రచారం జరుగుతోంది...అవేంటంటే?
అధినేతకు...కర్నూలు అసమ్మతి సెగ
టిడిపి అధినేత చంద్రబాబును తరుచూ చీకాకు పెట్టే అంశాల్లో కర్నూలు జిల్లా అసమ్మతి సెగ ఒకటి. నిన్నటిదాకా మంత్రి అఖిల ప్రియ, ఎన్ వి సుబ్బారెడ్డి విభేదాలతో పార్టీ రచ్చ పదేపదే రచ్చ కెక్కుతుండటంతో స్వయంగా చంద్రబాబే పిలిపించి పంచాయితీ పెట్టి రాజీ చేసి పంపించారు. ఆ తరువాత కూడా వీరు వెనక్కి తగ్గనట్లుగా కనిపించినా వార్తల్లోకైతే ఎక్కడం లేదు. ఇక సరేనని సంతోషించేలోపు టిడిపి అధినేత చంద్రబాబుకు మళ్లీ అదే జిల్లాలో మరోచోట నుంచి అసమ్మతి సెగ తగిలింది. అది బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డి నుంచి ఎగసిపడుతున్న అసంతృప్తి జ్వాల అని ఆయన అలకపానుపు ఎక్కి ఇటు మహానాడుకు, అటు తన కర్నూలు జిల్లా పర్యటనకు ఆయన ఎగ్గొట్టడం ద్వారా సిఎం చంద్రబాబుకు అర్థమైంది.
సిఎంతో...ఎమ్మెల్యే సమావేశం
దీంతో సిఎం చంద్రబాబే ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డిని అమరావతికి పిలిపించి విషయమేమిటో తెలుసుకున్నారు. ఆయనచెప్పిన విషయాలు విని చంద్రబాబే ఆశ్చర్యపోయారట. అసలు విషయమేమిటంటే...కాటసాని రామిరెడ్డి గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున బనగానపల్లెలో ఎమ్మెల్యే స్థానానికి బీసీ జనార్దనరెడ్డిపై పోటీచేసి ఓడిపోయారు. అప్పటినుంచి బీసీ జనార్దనరెడ్డి, కాటసాని రామిరెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కాటసాని అయితే ఇదే కాటసాని రామిరెడ్డి కుమార్తెను నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. భూమా నాగిరెడ్డి మరణానంతరం బ్రహ్మానందరెడ్డి నంద్యాల నుంచి పోటీచేసి గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ బంధుత్వం నేపథ్యంలో నంద్యాల నియోజకవర్గంలో, ఆళ్లగడ్డలో కాటసాని రామిరెడ్డికి మంత్రి అఖిలప్రియ ద్వారా అనేక కాంట్రాక్టులు దక్కుతున్నాయట. ఫలితంగా కాటసాని అంతకంతకూ ఆర్ధికంగా బలపడుతున్నాడనీ...అది వచ్చే ఎన్నికల్లో తనకు చాలా ఇబ్బందని బీసీ జనార్దనరెడ్డి భావిస్తున్నారు. అంతేకాకుండా బనగానపల్లె నియోజకవర్గంలో వైసీపీకి చెందిన అనేకమందికి మంత్రి అఖిలప్రియ సిఎం సహాయనిధి నుంచి డబ్బు ఇప్పిస్తున్నారని అది కూడా తనకు ఇబ్బందేనని జనార్దనరెడ్డి సిఎం ముందు తన ఆవేదన వ్యక్తం చేశారట. వాటి తాలూకూ ఆధారాలు కూడా సమర్పించారు.
సిఎంకు...అఖిల ప్రియ వివరణ
బనగానపల్లె ఎమ్మెల్యే చెప్పిన విషయాలు సావధానంగా ఆలకించిన సిఎం ఈ అంశాన్ని ఇంకా ముందే తన దృష్టికి తీసుకువస్తే బాగుండేదని ఎమ్మెల్యేతో అన్నారట. ఆ తరువాత ఈ విషయాలపై మంత్రి అఖిలప్రియతో చంద్రబాబు మాట్లాడారట. రామిరెడ్డి అనే కాంట్రాక్టర్కు పనులు ఎందుకు ఇస్తున్నారని సిఎం ఆమెను ప్రశ్నించారట. దీనిపై ఆమె స్పందిస్తూ రామిరెడ్డి అనే కాంట్రాక్టర్, కాటసాని రామిరెడ్డి అనే కాంట్రాక్టర్ ఇద్దరూ వేర్వేరు అని... ఇక ఆ రామిరెడ్డి అనే కాంట్రాక్టర్కు తానే కాకుండా అన్ని నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు, చివరకు డిప్యూటీ సిఎం కేఈ కృష్ణమూర్తి, ఏరాసు ప్రతాపరెడ్డి వంటి పెద్ద నేతలు కూడా పనులు ఇచ్చారని...అందుకే తాను కూడా ఇవ్వాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారట. అయినా మీరు వద్దు అంటే తాను అయిదు నిముషాల్లో ఆ నిర్ణయాన్ని మార్చుకుని వేరే వారికి ఆ పనులు అప్పగిస్తానని అఖిలప్రియ అన్నారు. తనకు పార్టీ శ్రేయస్సే ముఖ్యమని ఈ సందర్భంగా ఆమె ముఖ్యమంత్రికి స్పష్టం చేసినట్లు తెలిసింది.
మారిన...అఖిల ప్రియ తీరు
అలాగే వైసిపి వ్యక్తులకు సీఎం రిలీఫ్ ఫండ్ అందడంపైనా మంత్రి అఖిలప్రియ చంద్రబాబుకి వివరణ ఇచ్చారట. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం జిల్లావ్యాప్తంగా అనేకమంది తన వద్దకు వస్తున్నారని, వారికి వచ్చిన జబ్బు, వారి ఆరోగ్య నివేదిక, రోగి పరిస్థితిని వ్యక్తిగతంగా చూసి ఆ తరువాత వారికి సిఎం సహాయనిధికి సిఫార్సు చేస్తున్నానని...బాధల్లో ఉన్న వారికి సహాయం చేస్తే వారు కలకాలం గుర్తుపెట్టుకుంటారనీ, అది రేపు ఎన్నికల్లో పార్టీ గెలుపుకు మరింత ఉపయోగకరమని ఆమె వివరించారట. పైగా ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డి తన తండ్రి నాగిరెడ్డికి బాగా తెలిసిన వ్యక్తి అనీ, తనను కోడలా అని పిలుస్తారనీ ఆయన తనతో ఈ విషయం చెప్పివుంటే అక్కడే సమస్య పరిష్కరించే దానినని ఆమె చంద్రబాబుతో అన్నారట. ఇప్పుడైపా పార్టీ ప్రయోజనాల దృష్ట్యా మీరెలా ఆదేశిస్తే అలా నడుచుకుంటానని మంత్రి అఖిలప్రియ అనడంతో సిఎం ఇంకేమీ అనలేకపోయారట. గతంలో కొంత ధిక్కార దోరణి కనబరిచే అఖిల ప్రియ తీరు ఇప్పుడు చాలా మారిందంటున్నారు. మరి ఆళ్లగడ్డ రాజకీయం తరహాలో ఈ బనగానపల్లె పాలిటిక్స్ ఏమవుతాయనేది ఆసక్తికరంగా మారింది.