వారేమన్నా మహాత్ములా ..? పందికొక్కుల్లా మేసి ..అవినీతి సామ్రాజ్యం ఏలారు : మంత్రి అనీల్ ఫైర్
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మీద, టిడిపి నాయకుల మీద వైసిపి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర ఆరోపణలు చేశారు.టిడిపి హయాంలో అన్ని దోపిడీలు జరిగాయని, చంద్రబాబు అండ్ టీం అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.చంద్రబాబు అవినీతి సామ్రాజ్యం ఇప్పుడు బయట పడుతుందని మండిపడిన అనిల్ కుమార్ యాదవ్ చంద్రబాబు హయాంలో స్కీములను స్కాములుగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అవినీతిలో వారిద్దరే కాదు ఇంకా చాలా మందే
తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చంద్రబాబు హయాంలో జరిగిన ఒక్కొక్క స్కామ్ బయటకు వస్తోందంటూ పేర్కొన్నారు. ఒక్క అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రమే కాకుండా అవినీతిపరుల జాబితా ఇంకా ఉందని, తప్పు చేసిన వారెవరిని వదిలిపెట్టబోమని మంత్రి అనిల్ కుమార్ హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు తమ ప్రభుత్వ హయాంలో అవినీతి చేయించి ఇప్పుడు వారిని మహాత్ముల్లా అభివర్ణిస్తున్నారు అని ఆయన మండిపడ్డారు.
వారు మహాత్ములా ? స్వాతంత్ర సమరయోధులా
అవినీతి నేతలను అరెస్ట్ చేస్తే బీసీ కార్డు వేస్తున్నారని, కుల రాజకీయాలు చేస్తున్నారని పేర్కొన్నారు అనిల్ కుమార్ యాదవ్. టిడిపి హయాంలో కార్మికుల సొమ్ము మింగేసింది ఒకరైతే, అక్రమ బస్సులను నడిపి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడింది మరొకరు అంటూ అచ్చెన్నాయుడు,జేసీ ప్రభాకర్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 150 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడిన అచ్చెన్నాయుడును, నకిలీ సర్టిఫికెట్ లతో, ఫోర్జరీ చేసి 150 బస్సులు నడిపినజేసీ ప్రభాకర్ రెడ్డి మహాత్ములా? అని చంద్రబాబును ప్రశ్నించారు. ఇక వారేమైనా స్వాతంత్ర సమరయోధులా అంటూ మండిపడ్డారు. ప్రజాధనాన్ని పందికొక్కుల్లా గా మేశారని ఫైర్ అయ్యారు.
తప్పు చేస్తే శిక్షిస్తే రాజారెడ్డి రాజ్యాంగమంటారా ?
ఇక బీసీ నేతకు బీసీలు అండగా ఉండాలని టిడిపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై విరుచుకు పడిన మంత్రి పందికొక్కులా అచ్చెన్నాయుడు 150 కోట్లు మెక్కేస్తే బీసీలు అండగా ఉండాలా? అంటూ టిడిపి నేతలను నిలదీశారు. అప్పుడే అయిపోలేదు ఇంకా ముందుంది ముసళ్ళ పండగ అంటూ వ్యాఖ్యానించిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అవినీతి జాబితాలో ఇంకా చాలా మంది టిడిపి నేతల పేర్లు ఉన్నాయని పేర్కొన్నారు. తప్పు చేసిన వాళ్లని శిక్షిస్తే అరాచక పాలన చేస్తున్నారని, రాజారెడ్డి రాజ్యాంగం నడిపిస్తున్నారని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఎవరు చేసిన పాపం వారే అనుభవించాలి
టిడిపి నేతలు తాము తప్పు చేయలేదని ఎందుకు చెప్పలేకపోతున్నారని నిలదీశారు అనీల్ కుమార్ యాదవ్.ఇక టిడిపి నేతలకు పార్టీ మునిగిపోతుందన్న ఆందోళన మొదలైందని ఆయన పేర్కొన్నారు.ఇక కులాల మధ్య చిచ్చు పెట్టడం టిడిపి నేతలకు అలవాటు అన్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్ లోకేష్ కు కనీస జ్ఞానం కూడా లేదని వ్యాఖ్యానించారు. ఎవరు చేసిన పాపం వారు అనుభవించక తప్పదుఅని పేర్కొన్న మంత్రి టిడిపి అవినీతి సామ్రాజ్యం బద్దలయ్యే రోజు దగ్గర్లోనే ఉంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.