పోలవరం వద్ద వంద అడుగుల వైఎస్సార్ విగ్రహం: మరో రాజకీయ రాద్ధాంతం?: మంత్రి అనిల్ సందర్శన
అమరావతి: గోదావరి నదిపై ప్రతిష్ఠాత్మకంగా నిర్మితమౌతోన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగం పుంజుకుంటున్నాయి. వచ్చే ఏడాది చివరినాటికి ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నిర్మాణ పనులను పర్యవేక్షించడానికి జల వనరుల శాఖ మంత్రి పీ అనిల్ కుమార్ యాదవ్ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వచ్చే ఏడాది చివర్లో ప్రాజెక్టును అందుబాటులోకి తెస్తామంటూ రెండు రోజుల కిందటే ప్రకటించిన ఆయన.. దానికి అనుగుణంగా నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
పోలవరం ఎత్తుపై వివాదాలు ముసురుకుంటోన్న వేళ..
పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై ప్రస్తుతం రాజకీయ వివాదాలు ముసురుకుంటోన్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు ఎత్తును తగ్గించడానికి వైెఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కుట్ర పన్నిందని, ఫలితంగా- సాగునీటిని అందించే పరిధి తగ్గుతుందంటూ తెలుగుదేశం పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో లాలూచీ పడి, ఆయన బెదిరింపులకు భయపడి ఈ ప్రాజెక్టు ఎత్తును తగ్గిస్తున్నారంటూ మాజీమంత్రులు దేవినేని ఉమామహేశ్వర రావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. దీనిపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వివరణ కూడా ఇచ్చారు.
దుమారం చెలరేగుతుండగా..
పోలవరం ఎత్తుపై రాజకీయ దుమారం చెలరేగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో అనిల్ కుమార్ యాదవ్ పర్యటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజుతో కలిసి హిల్వేపై కాంక్రీట్ నిర్మాణం దగ్గర ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను మంత్రి పరిశీలించారు. తొలత పోలవరం ప్రాజెక్టు హిల్వేపై నుండి ప్రాజెక్టు స్పిల్వే కాంక్రీట్ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం స్పిల్వే 45వ బ్లాక్ దగ్గర నిర్మాణ పనులను పర్యవేక్షించారు. అక్కడి నుంచి ఒకటో బ్లాక్ వరకూ కాలినడకన వెళ్లారు. పనులను పరిశీలించారు.
రైట్ అండ్ లెఫ్ట్..
పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45.15 మీటర్లకు కుదిస్తున్నారంటూ దేవినేని ఉమా మహేశ్వరరావు చేసిన ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదని అన్నారు. 2021 డిసెంబర్ నాటికి గ్రావిటీ ద్వారా రైట్ అండ్ లెఫ్ట్ కెనాల్ ద్వారా నీటిని అందిస్తామని చెప్పారు.స్పిల్ వే నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. స్పిల్ వే నిర్మాణం పూర్తవుతోన్న దశలో ఎత్తును తగ్గించడానికి సాధ్యపడదనే విషయం తెలిసి కూడా రాజకీయ దురుద్దేశాలతో విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పోలవరం ఎత్తు తగ్గించారని చంద్రబాబు కలగన్నారని ఎద్దేవా చేసిన ఆయన ఇందులో ఎలాంటి మార్పులు ఉండబోవని మరోసారి తేల్చి చెప్పారు.
Recommended Video
ప్రాజెక్టు వద్ద 100 అడుగుల వైఎస్సార్ విగ్రహం..
ప్రాజెక్టుతో పాటు ప్రాంగణంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి చెందిన వంద అడుగుల ఎత్తు విగ్రహాన్ని కూడా పూర్తి చేస్తామని అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. త్వరలోనే ఈ విగ్రహానికి సంబంధించిన ఏర్పాట్లను చేపడతామని అన్నారు. విగ్రహం ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలను రూపొందించాలని అధికారులను ఆదేశించానని, త్వరలోనే వాటికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామని అన్నారు. ప్రాజెక్టు నిర్మించాలనే సత్సంకల్పంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన హయాంలో కాలువలను నిర్మించారని, దానిపైనా టీడీపీ నేతలు విమర్శలు చేశారని గుర్తు చేశారు.