పోలవరం ఎత్తు తగ్గదు .. టేప్ తెచ్చి కొలుచుకో : చంద్రబాబుకు మంత్రి అనిల్ పంచ్
పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో టిడిపి నేతలు చేస్తున్న విమర్శలకు జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమాధానం చెప్పారు. ఎత్తు ఒక్క అంగుళం కూడా తగ్గదని స్పష్టం చేసిన మంత్రి 2021 డిసెంబరు నాటికి పోలవరం పూర్తి చేస్తామని ప్రకటించారు. అప్పుడు చంద్రబాబు టేపు తీసుకొని ప్రాజెక్టు ఎత్తు కొలుచుకోవచ్చునని మంత్రి ఎద్దేవా చేశారు. అంతేకాదు పోలవరం ప్రాజెక్టును ప్రారంభించింది వైయస్ రాజశేఖర్ రెడ్డి అని దానిని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేసేది జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చంద్రబాబు మధ్యలో వచ్చాడు మధ్యలోనే పోయాడు అంటూ వ్యాఖ్యలు చేశారు.
Recommended Video
చంద్రబాబు ... పునరావాసం కోసం ఒక్క పైసా అయినా ఇచ్చారా ?
టిడిపి కావాలని పోలవరం ప్రాజెక్టు ఎత్తు పై దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు అనిల్ కుమార్ యాదవ్. గత ప్రభుత్వ హయాంలో కమీషన్ల కోసం కక్కుర్తి పడటమే తప్ప, పోలవరం ముంపు గ్రామాల ప్రజల పునరావాసం కోసం ఏం చేశారు అంటూ ప్రశ్నించారు. ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసానికి ఒక్క పైసా కూడా ఇవ్వకుండా ప్రాజెక్టులు ఎలా పూర్తవుతాయి ?నీళ్లు ఎలా వస్తాయి ? అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు ఆర్ అండ్ ఆర్ అంటూ మాట్లాడతావా అంటూ చంద్రబాబు మీద నిప్పులు చెరిగారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్.
చంద్రబాబుకు ధైర్యం ఉంటే పోలవరంపై 2017 కేంద్ర క్యాబినెట్ నోట్ సారాంశం చెప్పాలి
ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పోలవరం నిర్మాణానికి శాయశక్తులా కృషి చేస్తున్నారని, త్వరితగతిన పూర్తి చేయాలని యుద్ధప్రాతిపదికన పనులు చేయిస్తున్నారని, నిర్వాసితుల పరిహారం చెల్లింపులకు, పునరావాస కల్పనకు ఇప్పటికే ఎన్నో చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. చంద్రబాబుకు ధైర్యం ఉంటే పోలవరంపై 2017 లో కేంద్ర క్యాబినెట్ లో పెట్టిన నోట్ సారాంశాన్ని ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్.
కమీషన్ల కోసమే బాబు కక్కుర్తి
పోలవరం అభివృద్ధిపై ఆలోచించకుండా చంద్రబాబు హయాంలో కేవలం కమీషన్ల కోసమే ఆలోచించారని పేర్కొన్న ఆయన రాష్ట్రంలో ఉండలేని వాళ్ళు, పక్క రాష్ట్రంలో నుండి టూరిస్టుల మాదిరిగా వచ్చి పోతున్న వాళ్లు పోలవరం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. పోలవరం విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, ఒక అంగుళం కూడా తగ్గకుండా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామని పేర్కొన్న అనిల్ కుమార్ యాదవ్ చంద్రబాబుకు , టీడీపీ నేతలకు పోలవరంపై మాట్లాడే అర్హత లేదన్నారు .
జగన్ హయాంలోనే ప్రాజెక్టులు పూర్తి
గండికోట ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన ఏడు వేల కుటుంబాలకు చంద్రబాబు హయాంలో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి గండికోట ముంపు వాసుల కోసం 900 కోట్ల రూపాయలు కేటాయించినట్లుగా పేర్కొన్నారు. వెలిగొండ కు సంబంధించి ఆర్ అండ్ ఆర్ కింద 12 వందల కోట్లు ఇస్తున్నట్లుగా పేర్కొన్న ఆయన చిత్రావతి రిజర్వాయర్ పూర్తి సామర్థ్యానికి చేర్చేందుకు 51 కోట్ల రూపాయలు ఇచ్చారని తెలిపారు. నెల్లూరు జిల్లా కండలేరు ప్రాజెక్టు విషయంలో కూడా సీఎం జగన్ తగిన చర్యలు తీసుకోబోతున్నారని పేర్కొన్న మంత్రి, రాష్ట్రంలోని ముఖ్యమైన ప్రాజెక్టులన్నీ వైయస్ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.