పవన్ ఇరుకునపడేలా... ఆ విషయాన్ని హైలైట్ చేస్తున్న వైసీపీ... క్షమాపణ డిమాండ్ చేసిన మంత్రి అవంతి
'రిపబ్లిక్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏపీ ప్రభుత్వంపై ఓ రేంజ్లో చెలరేగిన జనసేనానిపై వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా ఎటాక్ మొదలుపెట్టారు. ఇష్టారీతిన టికెట్ ధరలు పెంచి ప్రజలను దోపిడీ చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అంటూ పవన్ కల్యాణ్ను మంత్రులు ప్రశ్నిస్తున్నారు.సామాన్య ప్రజలపై సినీ ఇండస్ట్రీ దోపిడీని నిలువరించేందుకే ప్రభుత్వం ఆన్లైన్ టికెటింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెస్తోందనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. వైసీపీ వాదనతో ప్రజలు కనెక్ట్ అయితే పవన్ కల్యాణ్ ఇరుకునపడినట్లేనన్న వాదన వినిపిస్తోంది. తాజాగా ఇదే అంశంపై మంత్రి అవంతి శ్రీనివాస్ పవన్ కల్యాణ్ తీరును తప్పు పట్టారు. ముఖ్యమంత్రి,మంత్రులపై చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
పవన్ బ్యాలెన్స్ తప్పుతున్నారు...
పవన్ కల్యాణ్ తన వ్యాఖ్యలతో జనంలో పలుచబడిపోతున్నారని అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. మంత్రులను సన్నాసులు అనడాన్ని తప్పు పట్టారు. ఈ తరహా వ్యాఖ్యల ఏ సిద్దాంతం నేర్పించిందని ప్రశ్నించారు. టికెట్ ఆన్లైన్ విధానంపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారని... వ్యక్తిగత దూషణలు,బూతులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.ఒక పార్టీ అధినేతే ఇలా మాట్లాడితే ఇక కింది స్థాయి నాయకులు కార్యకర్తలు ఎలా ప్రవర్తిస్తారని ప్రశ్నించారు. రాజకీయ పార్టీని నడపాలంటే ఓర్పు,సహనం ఉండాలని... కానీ పవన్ కల్యాణ్ బ్యాలెన్స్ తప్పుతున్నారని విమర్శించారు.
పవన్ ఓ 10 రోజులు ధ్యాన కేంద్రానికి వెళ్లాలి...
గౌతమ బుద్దుడి గురించి మాట్లాడే పవన్ కల్యాణ్... ఓ 10 రోజులు ధ్యాన కేంద్రంలో గడిపితే మంచిదని మంత్రి అవంతి సూచించారు. ప్రభుత్వంపై చేసే విమర్శలు సహేతుకంగా ఉండాలి గానీ వ్యక్తిగతంగా మాట్లాడటం సరికాదన్నారు. సినిమా ఈవెంట్ జరిగిన వేదికను పవన్ రాజకీయ వేదికగా మార్చారని విమర్శించారు.అసలు పవన్ కల్యాణ్ రాష్ట్రంలోనే ఉండరు... ఆయన సినిమాలు కూడా విదేశాల్లో చిత్రీకరిస్తారు.. మరి ఏపీలో ఎందుకు షూటింగ్స్ జరపరు అని ప్రశ్నించారు. పెద్దలు చిరంజీవి,మోహన్బాబులపై పవన్ కల్యాణ్ అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. మొత్తం సినీ ఇండస్ట్రీకి నష్టం జరుగుతుందని మాట్లాడటం సరికాదన్నారు. కొత్త నటీనటులకి సైతం హిట్ సినిమాలు వస్తున్నాయన్నారు. డబ్బింగ్ సినిమాలను అదరించే గొప్ప అభిమానం తెలుగు ప్రేక్షకులకు ఉందన్నారు.
పవన్ను ఇరుకునడేలా...
సాధారణంగా పెద్ద హీరోల సినిమాలు విడుదలైనప్పుడు మొదటి వారం రోజులు భారీగా టికెట్ల ధరలను పెంచేస్తారు. థియేటర్ల వద్ద కొన్ని టికెట్లను,ఆన్లైన్లో కొన్ని టికెట్లను విక్రయించి మిగతావాటిని బ్లాక్లో అమ్మే పరిస్థితి నెలకొంది.దీంతో సామాన్యుల జేబులకు చిల్లులు తప్పట్లేదు. సినిమా విడుదలవడమే ఆలస్యం... తొలి వారం,పది రోజుల్లోనే భారీగా కలెక్షన్లు రాబట్టుకోవాలనే యోచనలో నిర్మాతలు ఉంటున్నారు. అలా అయితే సినిమా హిట్టు,ఫట్టుతో సంబంధం లేకుండా భారీగా కలెక్షన్లు రాబట్టుకోవచ్చునని భావిస్తున్నారు.ఈ క్రమంలో ప్రభుత్వ ఆదాయానికి కూడా భారీగా గండి పడుతోంది. ఎక్కువ ధరలకు టికెట్లు అమ్ముకుంటూ ప్రభుత్వానికి మాత్రం ఉన్న టికెట్ ధరల ప్రకారమే ట్యాక్స్ చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అటు సామాన్యులపై భారం పడకుండా,ఇటు ప్రభుత్వం ఆదాయం నష్టపోకుండా ప్రభుత్వమే ఆన్లైన్లో సినిమా టికెట్లను విక్రయించేందుకు పూనుకుంది. అయితే భారీ రెమ్యునరేషన్లు తీసుకునే హీరోలను ఈ ఆన్లైన్ టికెట్ వ్యవస్థ టెన్షన్ పెడుతోందనే వాదన బలంగా వినిపిస్తోంది.టికెట్ ధరలు పెంచకుండా ఉన్న ధరకే అమ్మితే ఎక్కడ తమ రెమ్యునరేషన్లకు కోత పడుతుందేమోననే ఆందోళన వారిలో నెలకొన్నట్లు చెబుతున్నారు. అందుకే నిన్నటి తన స్పీచ్లో పవన్ కూడా కొద్దిమంది గురించే ప్రస్తావించారు. అయితే ఇండస్ట్రీ అంటే కొద్ది మంది హీరోలదే కాదు కదా... కొద్దిమంది పేరు చెప్పి... మొత్తం ఇండస్ట్రీపైనే ప్రభుత్వం పగ పట్టిందనే రీతిలో మాట్లాడటం సబబు కాదంటున్నారు. వైసీపీ నేతలు ఇప్పుడిదే విషయాన్ని జనంలోకి తీసుకెళ్తున్నారు. ఒకవేళ జనం ఈ వాదనతో కనెక్ట్ అయితే పవన్ ఇరుకునపడినట్లే...!!