ఓట్ల కోసం గాజువాక, రాజధానిగా మాత్రం అమరావతి కావాలా? పవన్ కల్యాణ్పై మంత్రి అవంతి మండిపాటు
జనసేన అధినేత పవన్ కల్యాణ్పై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఎందుకు వద్దంటున్నారని ప్రశ్నించారు. ఓట్ల కోసం గాజువాక కావాలి, కానీ రాజకీయాలకు మాత్రం వద్దా అని నిలదీశారు. ఆదివారం విశాఖపట్టణంలో మంత్రి అవంతి శ్రీనావాస్ ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. విశాఖపట్టణం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా స్వాగతిస్తూ వైసీపీ శ్రేణులు కదం తొక్కగా.. మంత్రి ముందుకుసాగారు.
ఎందుకు పోటీచేశారు..?
గత ఎన్నికల్లో గాజువాక నుంచి పవన్ కల్యాణ్ ఎందుకు పోటీ చేశారని ప్రశ్నించారు. మీ స్వార్థ రాజకీయాల కోసం.. ఓట్ల కోసం గాజువాక కావాలి.. కానీ రాజకీయాలకు మాత్రం వద్దా అని అడిగారు. ఇప్పుడు రాజధానిగా అమరావతి కావాల్సి వచ్చిందా అని నిలదీశారు. రాజధానిగా అమరావతే కొనసాగించాలంటోన్న పవన్ కల్యాణ్ గాజువాక ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విశాఖపట్టణం రాజధాని ఉత్తరాంధ్రుల హక్కు అని నొక్కి వక్కానించారు.
దత్తపుత్రుడితో
ఇటు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసలు పుత్రుడు నారా లోకేశ్ పనికిరాకపోవడంతో.. తన పనులన్నీ దత్తపుత్రుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేత చేయించుకుంటున్నారని విమర్శించారు. అసలుపుత్రుడు పనికిరావడంతో.. దత్తపుత్రుడు రంగంలోకి దిగారని సెటైర్లు వేశారు. బీజేపీ-జనసేన పొత్తును పరోక్షంగా ప్రస్తావించారు. పొత్తుకు ప్రేరేపించింది చంద్రబాబు నాయుడేనని ఆరోపించారు.
రాజీనామా చేసి..
రాజధానిపై యాగీ చేస్తున్న చంద్రబాబు నాయుడు, నిజంగా చిత్తశుద్ధి ఉంటే విశాఖ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. అప్పుడు కూడా టీడీపీకి ప్రజలు పట్టం కడితే రాజధాని మార్పును ప్రజలు వ్యతిరేకిస్తున్నారని అర్థమవుతోందన్నారు. ఊరికే మాటలు మాట్లాడటం కాదని, చేతల్లో చూపించాలని సవాల్ విసిరారు.