చంద్రబాబు, లోకేశ్ పాస్పోర్ట్స్ను తక్షణమే సీజ్ చేయాలి.. వారిని విచారించాలి : మంత్రి అవంతి
ఏపీలో ఐటీ రైడ్స్ దుమారం ఇంకా కొనసాగుతుంది. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఆయన దగ్గర పని చేసిన మాజీ పీఏ శ్రీనివాస్ ను ఐటీ అధికారులు విచారిస్తే రెండు వేల కోట్ల రూపాయలకు పైగా దొరికాయని వైసీపీ నేతలు టీడీపీని టార్గెట్ చేస్తున్నారు . ఇక దీనిపై మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ చంద్రబాబును, ఆయన బినామీలను, లోకేశ్ ను విచారిస్తే ఎన్ని లక్షల కోట్ల రూపాయలు దొరుకుతాయో అంటూ ఆయన విమర్శలు గుప్పించారు.
చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ రాష్ట్రం విడిచి పారిపోకుండా వారి పాస్ పోర్ట్ లను సీజ్ చేసి మరీ విచారణ చెయ్యాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ, గత ఐదేళ్లలో లక్షల కోట్ల రూపాయలను టీడీపీ నేతలు విచ్చల విడిగా దోపిడీ చేశారని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో దోపిడీ రాజ్యం నడిచిందని ఆయన పేర్కొన్నారు. గతంలో ఏ నాయకుడు చేయని విధంగా టీడీపీ హయాంలో చంద్రబాబు ఎన్నో అక్రమాలు చేశాడని , అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. మొన్న ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు బుద్ధి చెప్పినా ఆ పార్టీ నేతల్లో మార్పు రాలేదని వ్యాఖ్యానించారు .
టీడీపీ నేతలు కావాలనే జగన్ ని, వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతి గురించి నాడు మోదీకి తెలియడం వల్లే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు నాడు రాలేదని మంత్రి అవంతి శ్రీనివాస్ ఆరోపించారు. చంద్రబాబు, లోకేశ్ లను విచారించాలని, వారి పాస్ పోర్టులను సీజ్ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.నిందితులు ఎంత పెద్ద వారైనా సరే వారిని శిక్షించాలని మంత్రి అవంతి శ్రీనివాస్ కోరారు . 25 ఏళ్లుగా శ్రీనివాస్.. టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గర పనిచేశాడని, దొంగ కంపెనీలను సృష్టించి దోచుకున్న డబ్బును విదేశాలకు పంపించారని ఆరోపించారు.