గంటా ఎఫెక్ట్: సొంత ప్రభుత్వంపై అయ్యన్న సంచలనం, జగన్కు ఛాన్స్
మంత్రి అయ్యన్న పాత్రుడు సొంత ప్రభుత్వం పైనే షాకింగ్ కామెంట్స్ చేశారు. పనికిమాలిన విశాఖ ఉత్సవాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని వ్యాఖ్యానించడం దుమారం రేపుతోంది.
విశాఖ: మంత్రి అయ్యన్న పాత్రుడు సొంత ప్రభుత్వం పైనే షాకింగ్ కామెంట్స్ చేశారు. పనికిమాలిన విశాఖ ఉత్సవాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని వ్యాఖ్యానించడం దుమారం రేపుతోంది.
నర్సీపట్నంలో శనివారం నిర్వహించిన డీఎల్డీఏ-పశుసంవర్థకశాఖ ఆధ్వర్యంలో పాలపోటీ, అందాల పోటీ, లేగదూడల ప్రదర్శనలను మంత్రి అయ్యన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
రైతులకు ఉపయోగపడే ఇటువంటి కార్యక్రమాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. చందాలు వసూలు చేసి పోటీలు నిర్వహించాల్సి రావడం బాధాకరమన్నారు. పనికిమాలిన ఉత్సవాలపై పెడుతున్న శ్రద్ధ ఇటువంటి వాటిపై పెట్టకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు.
కుమ్ములాటలకు నిదర్శనం
అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలు ప్రభుత్వంలోని అంతర్గత కుమ్ములాటలకు నిదర్శనమని ప్రతిపక్షాలు అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన కేబినెట్ మంత్రులనే చక్కదిద్దుకోలేని స్థితిలో ఉన్నారని అంటున్నారు. ఇటువంటి ముఖ్యమంత్రి ప్రజలకు ఏదో చేస్తారని ఎలా ఆశపడతామంటున్నారు.
గంటా వర్సెస్ అయ్యన్న
మంత్రి అయ్యన్న పాత్రుడు, మరో మంత్రి గంటా శ్రీనివాస రావుకు మధ్య చాలా రోజులుగా విభేదాలు ఉన్నాయి. ఇప్పుడు మంత్రి బహిరంగ వ్యాఖ్యలతో అవి రచ్చకెక్కాయి. రాష్ట్ర ప్రభుత్వం విశాఖ ఉత్సవ్ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. దీనిపై అయ్యన్న విమర్శలు చేశారు.
డ్యాన్సులాడే పండగకు..
అయ్యన్న మాట్లాడుతూ.. పాడి, మత్స్య పరిశ్రమల ద్వారానే రాష్ట్రానికి అధిక ఆదాయం వస్తోందని, ఇటువంటి కార్యక్రమానికి ఆ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్తో మాట్లాడి రూ.2 లక్షలు కూడా తీసుకురాలేకపోయారని, విశాఖలో మాత్రం డ్యాన్సులాడే పనికి మాలిన విశాఖ ఉత్సవ్కు రూ.5 కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు.
చంద్రబాబు ఆదేశం
విశాఖ ఉత్సవ్ను రాష్ట్రస్థాయి పండుగలా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇందుకోసం రూ.2.75 కోట్ల నిధులు విడుదల చేశారు. వచ్చే ఏడాది నుంచి జాతీయ స్థాయిలో నిర్వహించాలని సూచించారు. దీనివల్ల విశాఖకు పర్యాటకులు పెరుగుతారని, అనేక రంగాల్లో ఉపాధి అవకాశాలు కలుగుతాయని భావిస్తున్నారు. మంత్రి అయ్యన్న మాత్రం మొదటి నుంచి దీనిని వ్యతిరేకిస్తున్నారు.
మూడు రోజుల కింద కూడా..
మూడు రోజుల కిందట అయ్యన్న విలేకరులతో మాట్లాడుతూ.. విశాఖ ఉత్సవ్లో స్థానిక కళాకారులకు అవకాశం కల్పించడం లేదని, అలా చేస్తే తాము ఎవరం అందులో పాల్గొనబోమని హెచ్చరించారు. కొందరు అధికారులు కావాలనే స్థానిక కళాకారులను పక్కన పెడుతున్నారని అన్ని పత్రికల్లోనూ వార్తలు వచ్చాయి. దీనిపై గంటా సమీక్షించారు.
గైర్హాజరు
అయినప్పటికీ విశాఖ ఉత్సవ్ ప్రారంభ కార్యక్రమానికి అయ్యన్న గైర్హాజరయ్యారు. ఆయన వర్గంగా ముద్రపడిన విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుతోపాటు ఇతర ఎమ్మెల్యేలు గణబాబు, బండారు సత్యనారాయణమూర్తి, పీలా గోవింద్ కూడా హాజరు కాలేదు.
ల్యాండ్ పూలింగ్పైనా అదే తీరు
విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ (వుడా) ల్యాండ్ పూలింగ్ పథకం కోసం భూములు సేకరిస్తోంది. ఈ అంశంపై కేబినెట్లో చర్చించిన తర్వాతే వుడా అధికారులు రైతులతో చర్చిస్తున్నారు. అయితే ఇదే పథకం కోసం వేరేచోట అసైన్డ్ భూములను దళారులు సేకరిస్తున్నారంటూ వార్తలు వచ్చినప్పుడు కూడా దానిపై అయ్యన్న తీవ్రంగా స్పందించారని అంటున్నారు. అధికారులు, కొందరు దొంగలు కలిసి కుట్ర చేశారని ఆరోపించారట.
అందిపుచ్చుకున్న ప్రతిపక్షాలు
సీనియర్ మంత్రే ప్రభుత్వ కార్యక్రమాలను విమర్శిస్తుండడం చూసి ప్రతిపక్ష పార్టీ వైసీపీ దీనినే అందిపుచ్చుకుంది. వైసీపీ నేత బొత్స సత్యనారాయణ శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. విశాఖ తీరాన నిర్వహించేది ఉత్సవ్ కాదు జాతర అన్నారు. దానికి టీడీపీ నేతలే వెళ్లడం లేదని, ఇక ప్రజలు ఎలా వెళ్తారని ప్రశ్నించారు.
ఇప్పటికే చంద్రబాబు ఆగ్రహం
గంటాతో విభేదాల కారణంగానే ఇలా చేస్తున్నారని, ఇప్పటికే మంత్రుల మధ్య విభేదాలపై చంద్రబాబు సీరియస్గా ఉన్నారని, మరోసారి క్లాస్ తీసుకునే అవకాశాలున్నాయని అంటున్నారు.