ఒప్పేసుకున్న బొజ్జల: ఆ మాట నిజమేనన్నారు, ఇంతకీ ఏం చెప్పారు?..
తన ఆరోగ్యం బాగాలేని మాట వాస్తవమేనని అన్నారు. అయితే ఇంకో రెండేళ్లు సమర్థవంతంగా పనిచేసే శక్తి ఉందని, అయినా పదవి నుంచి తొలగించడం కొంత బాధ కలిగించిందని చెప్పారు.
శ్రీకాళహస్తి: టీడీపీ మంత్రివర్గ విస్తరణ తర్వాత శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని బుజ్జగించలేక ఆ పార్టీ నేతలు కిందా మీద పడ్డారన్న వార్తలు బాగానే వచ్చాయి. ఎంతమంది ఎన్ని రకాలుగా నచ్చజెప్పినా ఆయన మాత్రం పార్టీ తనను తీవ్రంగా అవమానించిందని భావించారు.
'రాధాకృష్ణ గురించి ఎవరికి తెలియదు, స్నేహమంటే వైఎస్ది, టీడీపీ ఫ్యూజులు అవుట్!'
ఇదిలా ఉండగానే, ఓ ఇంటర్వ్యూ కోసం బొజ్జల ఇంటికెళ్లిన ఆంధ్రజ్యోతి పత్రిక అసోసియేట్ ఎడిటర్ పై బొజ్జల సతీమణి తీవ్రస్థాయిలో మండిపడినట్లుగా వార్తలు వచ్చాయి. బొజ్జల ఆరోగ్యం దెబ్బ తిన్నదని, ఆయన మంత్రిగా అన్ ఫిట్ అని అర్థం వచ్చేలా తప్పుడు వార్తలు రాశారని ఆమె ఆగ్రహించినట్లుగా గుసగుసలు వినపించాయి. చివరకు దానివల్లే బొజ్జలను మంత్రివర్గం నుంచి బయటకు పంపించారని ఆరోపిస్తూ సదరు పత్రికా జర్నలిస్టుపై బొజ్జల సతీమణి తీవ్రస్థాయిలో మండిపడినట్లుగా చర్చ జరిగింది.
సోషల్ మీడియాలో జరిగిన ఈ చర్చను ఆ తర్వాత బొజ్జల తనయుడు సుధీర్ రెడ్డి తప్పుపట్టారు. ఇందులో వాస్తవం లేదన్నారు. ఇక్కడితో ఈ కథ ముగిసిపోయింది. ఇప్పుడిదంతా ఎందుకంటే.. తాను అనారోగ్యంతో ఉన్నానన్న మాట నిజమేనని తాజాగా బొజ్జల స్వయంగా అంగీకరించారు. అలాంటప్పుడు ఆయన ఆరోగ్యం బాగా లేదని ప్రచారం జరిగిన ప్రచారం నిజమేనన్నది దీంతో స్పష్టమవుతోంది.
గురువారం ఉదయం తిరుపతిలో మీడియాతో మాట్లాడిన బొజ్జల తన ఆరోగ్యంపై జరుగుతున్న ప్రచారం మీద స్పందించారు. తన ఆరోగ్యం బాగాలేని మాట వాస్తవమేనని అన్నారు. అయితే ఇంకో రెండేళ్లు సమర్థవంతంగా పనిచేసే శక్తి ఉందని, అయినా పదవి నుంచి తొలగించడం కొంత బాధ కలిగించిందని చెప్పారు.
మంత్రివర్గం నుంచి తనకు ఉద్వాసనకు పలకడంతో నియోజకవర్గంలోని చాలామంది కార్యకర్తలు బాధపడ్డారని, వారందరిని సముదాయించానని బొజ్జల చెప్పుకొచ్చారు. టీడీపీకి రాజీనామా చేసేది లేదని, పార్టీలోనే ఉంటానని అన్నారు.