రాజధానిపై బొత్సా కొత్త ట్విస్ట్: కమిటీ నివేదిక వచ్చినాకే స్పష్టత: సభలో చెప్పింది తుది నిర్ణయం కాదంటూ
ఏపీ రాజధానిగా అమరావతి కొనసాగింపు పైన బొత్సా మరోసారి ట్విస్ట్ ఇచ్చారు. శాసనమండలిలో టీడీపీ సభ్యుల ప్రశ్నకు అమరావతి రాజధాని కొనసాగుతుందనే సంకేతాలు ఇస్తూ..రాజధాని మార్పు ఆలోచన లేదని బొత్సా లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. దీంతో..అందరూ ఇక రాజధాని మార్పు లేదంటూ స్పష్టత వచ్చిందని భావించారు. కానీ, కొద్ది గంటలకే మంత్రి బొత్సా మరోసారి తన పాత వాదననే తెర మీదకు తీసుకొచ్చారు. సభలో సభ్యుడు ఆ సమాధానానికి అనుబంధ ప్రశ్న వేసి ఉంటే తాను స్పష్టత ఇచ్చి ఉండేవాడినని బొత్సా వ్యాఖ్యానించారు. ఇప్పటికే తాము నియమించిన నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా..అదే విధంగా అసెంబ్లీలో చర్చ తరువాతనే రాజధానిపైన స్పష్టత వస్తుందని బొత్సా చెప్పారు. దీంతో..ఇప్పుడు బొత్సా మండలిలో ప్రభుత్వం ఇచ్చిన క్లారిటీకి భిన్నంగా బయట ఈ రకంగా వ్యాఖ్యలు చేయటం పైన ఇప్పుడు కారణం ఏంటనే చర్చ రాజకీయంగా మొదలైంది.
మండలిలో చెప్పిన మాటకు భిన్నంగా..
అమరావతి నుంచి రాష్ట్ర రాజధానిని మార్చడానికి ఎలాంటి ప్రతిపాదన లేదు అంటూ.. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. టీడీపీ ఎమ్మెల్సీలు రాష్ట్ర రాజధాని మార్పుపై ప్రభుత్వానికి మూడు ప్రశ్నలు సంధిం చారు. అమరావతి నుంచి రాష్ట్ర రాజధానిని మార్చడానికి ప్రతిపాదన ఏదైనా ఉందా.. ఇప్పటి వరకూ అమరావతి అభివృద్ధి కోసం ఖర్చు చేసిన నిధుల వివరాలేమిటి.. రాష్ట్ర రాజధానిని మార్చడం వల్ల రాష్ట్ర ఖజానా ఆర్థిక పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు. దీనిపై మంత్రి బొత్స సమాధానం చెప్పాల్సి ఉంది. చైర్మన్ ప్రశ్నలన్నింటికీ (డీమ్డ్ టూ బీ) ఆమోదం తెలిపారు. ఈ క్రమంలోనే రాజధానిని మార్చే ప్రతి పాదనలు లేవని ప్రభుత్వం చెప్పింది. దీంతో..ఇక రాజధాని మార్పు చర్చకు తెర పడినట్లుగా భావించారు. ఇది జరిగిన కొద్ది గంటల్లో మంత్రి బొత్సా విశాఖలో మరోసారి దీనికి భిన్నంగా స్పందించారు.
కమిటీ నివేదిక.. అసెంబ్లీలో చర్చ తరువాతనే
శాసన మండలిలో మంత్రి బొత్సా ప్రభుత్వం నుండి ఇదే అంశం పైన లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఇక, రాజధాని తరలింపు లేదనే అంచానలు మొదలయ్యాయి. కానీ, మంత్రి బొత్సా విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక వచ్చిన తరువాతనే అమరావతి రాజధానిగా కొనసాగింపు పైన స్పష్టత వస్తుందని పాత పాటే పాడారు. అసెంబ్లీలో దీని పైన చర్చ తరువాత స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. ఇదే సమయంలో రాజధాని రైతులను అన్ని విధాలుగా న్యాయం చేస్తామని స్పష్టం చేసారు. రాష్ట్రం మొత్తం అధికార వికేంద్రీకరణ చేయాల్సి ఉందని.. డెవలప్ మెంట్ అన్ని ప్రాంతాల్లో జరగాలనేదే తమ అభిప్రాయమని తేల్చి చెప్పారు. సోమ లేదా మంగళవారం అసెంబ్లీలో రాజధాని అంశం పైన చర్చ జరిగే అవకాశం ఉంది.
అనుబంధ ప్రశ్న వేసి ఉంటే..చెప్పేవాడిని
మండలిలో రాజధాని తరలింపు ప్రతిపాదన లేదని మండలిలో చెప్పిన అంశం పైనా బొత్సా స్పందించారు. సభలో దీని పైన సభ్యులు అనుబంధ ప్రశ్న వేసి ఉంటే తాను సమాధానం చెప్పేవాడినని బొత్సా వ్యాఖ్యానించారు. అమరావతితో నిర్మాణాలో చేయాలంటే భారీ ఖర్చు అవుతుందని మరోసారి చెప్పుకొచ్చారు. అమరావతిలో కొనసాగించాలా.. రాష్ట్రంలో ఎక్కడా ఏ రకంగా నిర్మాణాలు చేపట్టాలి..డెవలప్ మెంట్ చేయాలనే దాని పైన ఇప్పటికే తాము నియమించిన నిపుణుల కమిటీ నివేదిక సిద్దం చేసే పనిలో ఉందన్నారు. దీని పైన త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసారు. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన తరువాత మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి బొత్సా స్పష్టం చేసారు.