నా వ్యాఖ్యలు వక్రీకరించారు..బొత్సా : స్పష్టత మాత్రం ఇవ్వలేదు..సస్పెన్స్ కంటిన్యూ..!!
రాజధాని పైన చేసిన వ్యాఖ్యలతో రాష్ట్రంలో కలకలం రేపిన మంత్రి బొత్సా మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. రాజధాని ప్రాంతం పైన తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పుకొచ్చారు. వరదల అంశం పై తాను మాట్లాడానని వివరణ ఇచ్చారు. టీడీపీ..చంద్రబాబు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అమరావతి చుట్టూ రియల్ ఎస్టేట్ విలువ పడిపోతుందనేది వారి బాధ అని విమర్శించారు. అయితే, బొత్సా మాత్రం రాజధాని అక్కడే ఉంటుందా.. లేక మారుతుందా అనే దానికి మాత్రం స్పష్టత ఇవ్వ లేదు. రాజధాని ఉంటుందా..ఉండదా అనేది తాను చెప్పలేదని..దాని మీద ఎవరికి తోచిన విధంగా వారు స్పందిస్తున్నారని వ్యాఖ్యానించారు. అదే సమమయంలో అన్ని ప్రాంతాలు డెవలప్ కావాలంటూ చెప్పటం ద్వారా అధికార వికేంద్రీకరణ లేదా రాజధాని మార్పు గురించా అనేది ఇంకా మంత్రి బొత్సా సస్పెన్స్ కంటిన్యూ చేసే విధంగానే స్పందించారు.
వరదల అంశంపై మాత్రమే మాట్లాడాను..
మంత్రి బొత్సా సత్యనారాయణ మరో సారి రాజధాని గురించి స్పందించారు. నాలుగు రోజలు క్రితం తాను రాజధాని ప్రాంతం పై చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పుకొచ్చారు. తాను అమరావతి ప్రాంతంలో వచ్చిన వరదల గురించి మాత్రమే మాట్లాడనని వివరించారు. తన వ్యాఖ్యల పైన టీడీపీ అధినేత చంద్రబాబు..పార్టీ నేతలు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అమరావతి చుట్టూ రియల్ ఎస్టేట్ భూం పడిపోతోందనేది వారి బాధ అంటూ విమర్శించారు. చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారిలా మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాలని తన ఆకాంక్ష అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు రాజధాని మార్పుతో రెండు కోట్ల సంపద నాశనం అవుతుందని అంటున్నారని..తాము రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల సంపద సంపాదని సృష్టించబోతున్నామంటూ మరో సారి కీలక వ్యాఖ్యలు చేసారు. అదే సమయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యల మీద బొత్సా తీవ్రంగా స్పందించారు.
నారాయణ రిపోర్ట్ అమలు చేసారు..
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెన్నై..ముంబాయి రాజధానుల గురించి మాట్లాడుతున్నారని..అవి ఎప్పుడో జరిగిన రాజధాని నిర్మాణాలని గుర్తు చేసారు. సముద్రంలో..నదుల్లో కూడా రాజధాని ప్రాంత నిర్మాణాలు జరిగాయంటూ వివరించారు. అమరావతిలో నిర్మాణాలు భూమిలోపల మాత్రమే జరిగాయని... నిర్మాణాలు పూర్తయ్యాయనేది అవాస్తవమని స్పష్టం చేసారు. రాజధాని విషయంలో కేంద్రం నియమించిన శివరామక్రిష్ట ఇచ్చిన నివేదిక కాకుండా.. నారాయణ ఇచ్చిన నివేదిక అమలు చేసారని దుయ్యబట్టారు. ఏడు లక్షల క్యూసెక్కుల నీరు వస్తేనే అమరావతి ప్రాంతం ముంపుగు గురైందని వివరించారు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే..అమరావతిలో నిర్మాణ ఖర్చు సైతం చాలా ఎక్కువని మంత్రి బొత్సా మరో సారి వ్యాఖ్యానించారు. అమరావతిలో మొత్తం చంద్రబాబు బినామీలే భూములు కొన్నారని అందుకే వారు వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. అన్ని ప్రాంతాలను సమానంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్నారు.
స్పష్టత లేదు..సస్పెన్స్ కంటిన్యూ..
తన వ్యాఖ్యల మీద రాజకీయంగా..సామాన్య ప్రజల్లోనూ చర్చ జరుగుతుంటే బొత్సా మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వటం లేదు. మరో సారి మాట్లాడిన బొత్సా రాజధాని అమరావతిలోనే ఉంటుందా.. మార్చే ఆలోచన ఉందా అని ప్రశ్నిస్తే ఉంటుందా..ఉండదా అనేది కాదని.. అక్కడి పరిస్థితి మాత్రమే వివరిస్తున్నాని చెప్పుకొచ్చారు. కానీ, స్పష్టంగా రాజధాని అమరావతిలోనే ఉంటుందని..ఉండదని కానీ స్పష్టత ఇవ్వలేదు. అదే సమయంలో అన్ని ప్రాంతాల్లో డెవలప్ మెంట్ ఉండాలని చెప్పటం ద్వారా అధికార వికేంద్రీకరణ గురించి చెబుతున్నారా.. లేక రాజధాని తరలించే ఉద్దేశంతో మాట్లాడుతున్నారా అనే అంశం మీద క్లారిటీ ఇవ్వటం లేదు. తాము అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నామని బొత్సా వ్యాఖ్యానించారు. దీని ద్వారా బొత్సా తన వ్యాఖ్యల ద్వారా సస్పెన్స్ ను మరింత కాలం కొనసాగించే అవకాశం కనిపిస్తోంది.