అలాంటివి రాయొద్దు.. అసత్య ప్రచారాలు మానుకోవాలి.. : మంత్రి బొత్స సత్యనారాయణ
వైజాగ్ గ్యాస్ లీకేజీ ఘటనపై మాట్లాడిన మంత్రి బొత్స సత్యనారాయణ.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా వార్తలు రాయవద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు. లోకో పైలట్లు విష వాయువు బారిన పడ్డారన్నది అవాస్తవమన్నారు. గ్యాస్ ప్రభావిత గ్రామాల్లో అన్ని వసతులు కల్పిస్తున్నామని,ప్రభుత్వం అందరికీ అండగా నిలబడుతోందని స్పష్టం చేశారు. కాబట్టి సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలకు తెరదించాలని విజ్ఞప్తి చేశారు.
మరో మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. . జీవీఎంసీ అధికారులు ఇచ్చిన సూచనలు మేరకు ఇళ్లలోకి వెళ్లాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. అయితే ఇళ్లల్లో ఏసీలు ఆన్ చేయవద్దని చెప్పారు. గ్రామాల్లోకి వచ్చేవారికి ఆహారంతో పాటు వైద్య సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఏ ఒక్కరూ ఆకలితో పడుకోకుండా అందరికీ భోజన వసతి ఏర్పాటు చేస్తున్నామన్నారు.వార్డు వలంటీర్లు, అధికారులు గ్రామాలను పర్యవేక్షించి సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు.
ఇదిలా ఉంటే,బాధితులకు ఇప్పటికే పరిహారం విడుదల చేసిన జగన్ సర్కార్.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఐదు గ్యాస్ ప్రభావిత గ్రామాల్లో ఎంతమంది ఉంటే అంతమందికి రూ.10వేలు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున ఆ ఇంటి మహిళ బ్యాంకు ఖాతాలో జమ చేయాలని ముఖ్యమంత్రి జగన్ మంత్రులు,అధికారులను ఆదేశించారు. ఇంటింటికి వెళ్లి బ్యాంకుల స్లిప్లు వలంటీర్లు అందజేయాలన్నారు.మృతులకు ఇప్పటికే ఒక్కొక్కరికి రూ.1కోటి చొప్పున ఆర్థిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. తీవ్ర అస్వస్థతకు గురై వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నవారికి రూ.10 లక్షలు, ఆస్పత్రిలో రెండు, మూడు రోజుల చికిత్స అవసరమైన వారికి రూ.1లక్ష, స్వల్ప అస్వస్థతకుగురై ప్రథమ చికిత్స పొందిన వారికి రూ.25 వేలు, గ్యాస్ ప్రభావిత గ్రామాల్లోని ప్రతీ కుటుంబానికి రూ.10 వేలు ఆర్థిక సాహాయం చేయాలని ఇప్పటికే నిర్ణయించారు.