కాక రేపుతున్న సవాళ్లు... 48గంటల డెడ్ లైన్... వైసీపీ-టీడీపీ హోరాహోరీ రాజకీయం...
ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల ఏర్పాటుపై అధికార వైసీపీ,ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్దం నడుస్తోంది. మూడు రాజధానులతోనే అన్ని ప్రాంతాలు సమ అభివృద్ది చెందుతాయని వైసీపీ బలంగా వాదిస్తోంది. మరోవైపు టీడీపీ మాత్రం ఇది అభివృద్దికి విఘాతం కలిగించే చర్యగా అభివర్ణిస్తోంది. తాజాగా ఇరు పార్టీల నేతలు మరోసారి పరస్పర సవాళ్లు విసురుకున్నారు. దమ్ముంటే ఛాలెంజ్ స్వీకరించాలని కామెంట్స్ చేశారు.
చంద్రబాబుకు బొత్స సవాల్...
మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. చంద్రబాబుకు నమ్మకం ఉంటే టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను, ఎంపీలను తక్షణం రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్ళాలని సవాల్ విసిరారు. ప్రజాక్షేత్రంలో నిలబడితే ప్రజలు ఎవరివైపు ఉన్నారో తేలిపోతుందన్నారు. మూడు రాజధానులపై చంద్రబాబు ప్రెస్ మీట్ చూస్తే ఆయనకు పూర్తిగా మతిస్థిమితం లేదని రూఢీ అవుతోందని విమర్శించారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి,తాడికొండ నియోజకవర్గాల్లో ప్రజలిచ్చిన తీర్పు చంద్రబాబు 'రాజధాని డిజైన్'కు చెంప పెట్టు కాదా అని ప్రశ్నించారు.
చంద్రబాబుకు 48గం. డెడ్ లైన్...
తాను విసిరిన సవాల్ను స్వీకరిస్తున్నారో లేదు 48 గంటల్లోగా బదులివ్వాలని బొత్స డిమాండ్ చేశారు.అభివృద్ది వికేంద్రీకరణను వ్యతిరేకిస్తే చంద్రబాబు చరిత్ర హీనులుగా మిగిలిపోవడం తప్ప ఏమీ ఉండదన్నారు. తాను పుట్టి,పెరిగిన రాయలసీమలో జ్యుడీషియల్ కేపిటల్ ఏర్పాటును సైతం చంద్రబాబు వ్యతిరేకించి సొంత మామకే కాదు సొంత గడ్డకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. చంద్రబాబు కుట్రలు,కుయుక్తులు సాగనిచ్చేది లేదని స్పష్టం చేశారు.
Recommended Video
జగన్ 48గంటల్లోగా స్పందించాలి : యనమల
అటు మంత్రి బొత్స చంద్రబాబును సవాల్ చేయగా... ఇటు మాజీ మంత్రి యనమల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు. జగన్కు దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలనిచంద్రబాబు చేసిన సవాల్ను స్వీకరించాలన్నారు. ఇందుకోసం 48 గంటల సమయం ఇస్తున్నానని... ఈలోగా ఆయన స్పందించకపోతే మళ్లీ మాట్లాడుతానని చెప్పారు.జగన్ రాజకీయాల వల్ల 13 జిల్లాల అభివృద్ధికి ఆటంకం కలుగుతుందన్నారు. ఇది కచ్చితంగా తుగ్లక్ పాలనే అని... రాష్ట్రాన్ని పాడుకోవడానికి ప్రజలంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.