బొత్స వ్యాఖ్యలపై కలకలం.. ఆ మాట అనలేదని బహిరంగ లేఖ..
బీజేపీతో వైసీపీ పొత్తుపై లీకులు ఇచ్చారని తనపై జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ ఖండించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే ఎన్డీయేలో చేరే అంశాన్ని పరిశీలిస్తామని తాను ఎక్కడా అనలేదన్నారు. తనపై ఈ ఆరోపణలు చేస్తున్నవారు.. ఆ వ్యాఖ్యలు తాను ఎక్కడ చేశానో చూపించాలని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలుగా ఎవరి అభిప్రాయాలు,ఆలోచనలు వారికి ఉంటాయని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఓ బహిరంగ లేఖ కూడా రాశారు.
కేంద్రంతో సఖ్యతపై బొత్స వ్యాఖ్యలు..
శనివారం ప్రెస్ మీట్ సందర్భంగా పలువురు విలేకరులు కేంద్రంతో సంబంధాలపై బొత్సను ప్రశ్నించారు. దీనికి బొత్స బదులిస్తూ.. కేంద్రంతో తామేమీ అంటీముట్టనట్టుగా ఉండట్లేదని.. అదే సమయంలో దూరంగానూ ఉండట్లేదని స్పష్టం చేశారు. నిన్న మొన్నటివరకు కేంద్రం జగన్ను దగ్గరికి రానివ్వట్లేదని.. మోదీ,అమిత్ షా జగన్కు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని ప్రచారం చేశారని.. ఇప్పుడేమో కేంద్రానికి దగ్గరైపోతున్నారని మాట్లాడుతున్నారన్నారు.కేంద్రం పట్ల వైసీపీ వైఖరి అంశాలవారీగా ఉంటుందని, రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా తమ విధానాలు ఉంటాయని చెప్పారు. రాష్ట్రం కోసం ఎవరి గడ్డం పట్టుకుని బతిమాలేందుకైనా తమకు అభ్యంతరం లేదన్నారు. అదే సమయంలో రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగిస్తే చూస్తూఊరుకోమన్నారు.
ఎన్డీయేలో చేరడంపై బొత్స..
ఇక వైసీపీ ఎన్డీయేలో చేరబోతుందా అన్న ప్రశ్నకు బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దానివల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందనుకుంటే.. ఆ అవకాశం వస్తే పరిశీలిస్తారని చెప్పారు. అవసరం లేకపోతే మానేస్తారని అన్నారు. కేంద్రంతో నిత్యం ఘర్షణ పడాల్సిన అవసరం లేదని.. అంశాలవారీగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రాన్ని కచ్చితంగా నిలదీస్తామన్నారు.
ఖండించిన కొడాలి నాని...
శనివారం బొత్స ప్రెస్ మీట్ తర్వాత.. రాజధాని వికేంద్రీకరణపై గతంలో లీకులు ఇచ్చిన బొత్స.. ఇప్పుడు కేంద్రంతో వైసీపీ పొత్తుపై లీకులు ఇస్తున్నారన్న ప్రచారం ఊపందుకుంది. అయితే ఇదంతా తమను కొన్ని వర్గాలకు దూరం చేసేందుకు టీడీపీ చేస్తోన్న ప్రచారం అని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ ఎన్డీఏలో భాగస్వామ్యం కావచ్చని పిచ్చాపాటిగా ఎవరైనా మాట్లాడితే అది కరెక్టు కాదని పౌరసరఫరాల మంత్రి కొడాలినాని అన్నారు. కేంద్రంతో పొత్తుపై జగన్ నుంచి ప్రకటన వస్తే విశ్వసించాలన్నారు.
ఖండించిన బీజేపీ..
అటు బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి సునీల్ దేవధర్ ఇదే అంశంపై మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికార వైసీపీతో గానీ, ప్రతిపక్షం టీడీపీతో గానీ తమకెలాంటి పొత్తుల్లేవని స్పష్టం చేశారు. కొందరు వైసీపీ నాయకులు బీజేపీతో చేతులు కలుపుతామని మాట్లాడుతున్నారని.. దానిని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. అంతేకాదు, వైసీపీ, టీడీపీ రెండూ చాలా ప్రమాదకరమైన పార్టీలని, అనుభవంతోనే ఇది చెబుతున్నామని వ్యాఖ్యానించారు. నసేనతో మాత్రమే బీజేపీకి పొత్తుందని, ఆ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని స్పష్టం చేశారు.