ఏపీ అభివృద్ధి కోసమే అప్పులు -చంద్రబాబు శాపనార్థాలే జగన్కు దీవెనలు :మంత్రి బొత్స
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై అప్పుల భారం నానాటికీ పెరుగుతోందని కాగ్ రిపోర్టులు సైతం హెచ్చరించాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 20 నెలల్లోనే లక్ష కోట్ల రూపాయలకుపైగా అప్పులు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో.. నవంబర్ నాటికే రూ.73 వేల కోట్ల రుణం తెచ్చినట్లు కాగ్ గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంపై మొత్తం అప్పుల భారం రూ.3.73 లక్షల కోట్లు దాటింది. దీంతో జగన్ సర్కారు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. వీటిపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు..
గుట్టు విప్పిన అఖిలప్రియ -గ్యాంగ్ సినిమా చూపించి -3రోజులు, 30గం, 300ప్రశ్నలు -మళ్లీ కోర్టుకు
అప్పులు అవినీతి కోసం కాదు..
రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసింది అభివృద్ధి కోసమే కానీ అవినీతి చేయడం కోసం కాదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పారదర్శకత కోసమే కొత్త మున్సిపల్ పన్నుల విధానాన్ని తీసుకొచ్చామన్నారు. బుధవారం విజయనగరంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రజాసంక్షేమం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని తెలిపారు. జీవన ప్రమాణాలను మెరుగుపర్చడం కోసం తమ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. ప్రజా శ్రేయస్సు కోసం అనేక కార్యక్రమాలను చేపడుతుండటం వల్లే అప్పులు పెరిగాయని.. ఇది సహజమేనని బొత్స తెలిపారు.
చంద్రబాబు తిట్లే దీవెనలు..
టీడీపీ చీఫ్ చంద్రబాబు శాపనార్థాలే వైసీపీకి, సీఎం జగన్ కు దీవెనలని బొత్స అన్నారు. చంద్రబాబు తాను చేసిన తప్పులపై పశ్చాత్తాపం పడకుండా విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు. ఇష్టారీతిన పన్నులు వేస్తూ ప్రజలను బాధిస్తున్నామని చంద్రబాబు చేసిన విమర్శలను మంత్రి కొట్టిపారేశారు. విద్య, వైద్య రంగాల్లో ఎన్నో మార్పులను తీసుకొస్తూ ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్న ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం చంద్రబాబుకి తగదన్నారు. జగన్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేని చంద్రబాబు పిచ్చిపట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని, రాష్ట్రంలో చంద్రబాబు అండ్ కో ఆధ్వర్యంలో జరుగుతున్న కుతంత్రాలు బట్టబయలవుతున్నా ఆయనలో కనీస పశ్చాత్తాపం అనేది కూడా లేకుండా నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారని బొత్స ధ్వజమెత్తారు.
స్థానిక ఎన్నికల్లో టీడీపీ గల్లంతే..
ప్రజా శ్రేయస్సును కోరి కార్యక్రమాలను చేపడుతున్న నేపథ్యంలో అప్పులు పెరిగాయని.. ఇది ఎక్కడైనా సహజమేనని బొత్స వివరించారు. స్థానిక ఎన్నికల్లో ఇంత ఓటింగ్ శాతంతో గెలుస్తామని టీడీపీ చెప్పగలదా? అని బొత్స ప్రశ్నించారు. కొవిడ్ కారణంగానే ఇప్పుడు ఎన్నికలు వద్దంటున్నట్లు చెప్పారు. ఎన్నికల నిర్వహణ విషయంలో తెలుగుదేశం కావాలనే రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల గురించి వైసీపీకి ఎలాంటి భయం లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు హయాంలో లోకేశ్బాబుకు మినహా ఎవరికి ఉద్యోగాలు రాలేదని, కమీషన్ల కోసం అమరావతిని, దోపిడీ నిమిత్తం పోలవరం ప్రాజెక్ట్ను వాడుకున్నారని మండిపడ్డారు.
విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్
రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతమైన ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసి, విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తే బాబుకు ఎందుకు అంత ఆక్రోశం అని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. మాన్సస్ చరిత్ర గురించి ఏమాత్రం అవగాహన లేని చంద్రబాబు.. ట్రస్ట్ అంతర్గత విషయాల్లో తల దూర్చడం తగదన్నారు. మాన్సాస్ ట్రస్టుపై స్పందిస్తూ.. మాన్సాస్ ట్రస్టు రద్దు చేయాలని అశోక్గజపతిరాజు గతంలో లేఖ రాశారని మంత్రి అన్నారు. ట్రస్టు ఛైర్మన్గా ఆనందగజపతిరాజు ఉండడం ఇష్టం లేకే అశోక్ లేఖ రాసినట్లు చెప్పారు. మాన్సాస్ ట్రస్టు ప్రభుత్వంలో విలీనం చేయొద్దని గతంలో ఆనంద్ విజ్ఞప్తి చేశారని.. ఆయన విజ్ఞప్తి మేరకు ట్రస్టు ఛైర్మన్గా ఆనంద్నే కొనసాగించినట్లు బొత్స వెల్లడించారు.
షాకింగ్: పిల్లి కళేబరాన్ని తొవ్వి తీసి -కూరలా వండుకుని తిన్న సెలబ్రిటీ -పెను దుమారం