మండలి చైర్మన్ను మతం పేరుతో తిట్టలేదు.. నారా లోకేశే తాగుబోతులా ఊగిపోయాడు: మంత్రి బొత్స
పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై శాసన మండలిలో బుధవారం రాత్రి జరిగిన హైడ్రామాకు సంబంధించి ఒక్కో అంశం వెలుగులోకి వస్తోంది. వైసీపీ మంత్రులు ఫూటుగా తాగొచ్చి మండలిలో రచ్చ చేశారని టీడీపీ పక్ష నేత యనమల రామకృష్ణుడు ఆరోపించగా.. టీడీపీ ఎమ్మెల్సీలే తాగుబోతుల్లా ప్రవర్తించారని, మాజీ మంత్రి నారా లోకేశ్ ఊగిపోతూ మీదిమీదికొచ్చారని మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటరిచ్చారు. మండలి చైర్మన్ షరీఫ్ను మతం పేరుతో దూషించారన్న వివాదంపైనా బొత్స వివరణ ఇచ్చారు.
ఆఫ్ట్రాల్ లోకేశ్కే అంతుంటే..
రెండు బిల్లుల్ని సెలెక్ట్ కమిటీకి పంపే విషయంలో నిబంధనలేవీ పాటించలేదని స్వయంగా మండలి చైర్మన్ షరీఫే ఒప్పుకున్నారని, అలాంటప్పుడు మళ్లీ ఆయనే తప్పుడు నిర్ణయం ఎలా తీసుకుంటారని బొత్స ప్రశ్నించారు. ‘‘బుధవారం రాత్రి కూడా ఇదే అంశంపై మేము(వైసీపీ మంత్రులు) చైర్మన్ తో మాట్లాడుతుండగా.. నారా లోకేశ్, ఇంకొందరు టీడీపీ ఎమ్మెల్సీలు తాగినమైకంలో ఊగిపోతున్నట్లుగా మావైపు దూసుకొచ్చారు. నారా లోకేశైతే చేతులు పైకెత్తి బెదిరిస్తూ మీదికొచ్చాడు. ఆప్ట్రాల్ రెండేళ్లపాటు మంత్రిగా పనిచేస్తే ఇంత అహంకారమా? ఆయన అరిస్తే భయపడటానికి మేమేమైనా టీడీపీ కార్యకర్తలమా?''అని మంత్రి ఫైరయ్యారు.
షరీఫ్ ఐదు సార్లు నమాజ్ చేస్తాడు..
మండలి చైర్మన్ షరీఫ్ ను ఉద్దేశించి ‘‘నువ్వు సాయిబుకే పుట్టావా?''అని మంత్రి దూషించినట్లు కొన్ని పత్రికల్లో వార్తలొచ్చాయి. ఈ వివాదంపై బొత్స సమాధానమిచ్చారు. ‘‘మధ్యాహ్నం సమయంలో మండలి చైర్మన్ ను కలవాడికి వెళ్లినప్పుడు ఆయన నమాజ్ చేస్తూ కనిపించారు. అప్పుడు నాకు.. గతంలో ఆయన చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. మనిషి జన్మ ఒకసారే వస్తుందని, నమాజ్ చేస్తూ నియత్ గా ఉండాలన్నారు. మరి అలాంటి వ్యక్తే ఇవాళ అన్యాయంగా, రాజ్యాంగ విరుద్ధంగా నిర్ణయం తీసుకోవడం బాధాకరం. పత్రికల్లో వచ్చినట్లు నేను షరీఫ్ ను మతం పేరుతో దూషించలేదు''అని వివరించారు.
తొత్తులకు కీలక పదవులు
రెండు బిల్లుల్ని సెలెక్ట్ కమిటీకి పంపడాన్ని బీజేపీ, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు కూడా వ్యతిరేకించారని, అయినాసరే చైర్మన్ తన ఇష్టానుసారంగా వ్యవహరించి పదవికి మచ్చ తెచ్చారని బొత్స అన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతను బట్టి పెద్దల సభల్లో రూలింగ్ పార్టీకి మెజార్టీ ఉన్నా, లేకున్నా బిల్లుల్ని ఆమోదించడం సంప్రదాయమేనని, షరీఫ్ మాత్రం దానికి విరుద్ధంగా, అచ్చమైన టీడీపీ నాయకుడిగా వ్యవహరించారని మండిపడ్డారు. రాజ్యాంగబద్ధమైన కీలక పదవుల్లో చంద్రబాబు తన తొత్తుల్ని, అర్హతలేనివాళ్లను కూర్చొబెట్టి డ్రామాలు ఆడిస్తారని, ఆయన 40 ఏళ్ల రాజకీయ అనుభవం నిండా ఇలాంటి కుట్రలే ఉన్నాయని గుర్తుచేశారు.
అందుకే మండలి రద్దు..
చంద్రబాబు కనుసనన్నల్లో మండలి చైర్మన్ షరీఫ్ తీసుకున్న నిర్ణయం ప్రజావ్యతిరేక నిర్ణయమని, ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి కాబట్టే అసలు మండలి వ్యవస్థ అవసరమా? దాన్ని రద్దు చేసేద్దామా? అనే చర్చ జరుగుతోందని మంత్రి బొత్స అన్నారు. రాష్ట్రంలో అలజడులు రేపాలన్న దురుద్దేశంతోనే చంద్రబాబు నాయుడు మండలి లాబీలో కూర్చొనిమరీ టీడీపీ ఎమ్మెల్సీలను ఉద్రేకపరిచారని విమర్శించారు.