వైసీపీకి ఏడుగురు ఎమ్మెల్సీల షాక్.. బీజేపీతో మంత్రి బొత్స భేటీ
మూడు రాజధానుల వ్యవహారంలో జగన్ సర్కారు శాసన మండలిలో ఎదుర్కొంటున్న కష్టాలు రెట్టింపయ్యాయి. ఏపీ పాలన వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి బిల్లుల విషయంలో ఇప్పటిదాకా తటస్థంగా వ్యవహరించిన పీడీఎఫ్ ఎమ్మెల్సీలు.. తాజాగా అమరావతికే జైకొడతామని ప్రకటించడం సంచలనంగా మారింది. దీంతో మండలిలో చీలిక కోసం వైసీపీ చేస్తున్న ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
ఊగిసలాటకు ముగింపు..
రాజధాని మార్పు, సీఆర్డీయే రద్దు బిల్లుల్ని ప్రతిపక్ష టీడీపీ మంగళవారం రూల్ 71తో తాత్కాలికంగా అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఆ సందర్భంలో టీడీపీకి అనుకూలంగా 27 మంది, వ్యతిరేకంగా 11మంది ఓటేయగా, మరో 9 మంది ఎమ్మెల్సీలు తటస్థంగా ఉన్నారు. తటస్థుల్లో ఐదుగురు పీడీఎఫ్ ఎమ్మెల్సీలు. వారికి అనుబంధంగా కొనసాగుతోన్న మరో ఇద్దరు కలిసి.. మొత్తం ఏడుగురు ఎమ్మెల్సీలు తాము అమరావతికి అనుకూలంగా ఉన్నామని, మూడు రాజధానుల్ని వ్యతిరేకిస్తామని బుధవారం మీడియాకు తెలిపారు.
బీజేపీకి వైసీపీ వల..
మండలిలో మెజార్టీలేని కారణంగా బిల్లుల ఆమోదంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అధికార వైసీపీ అనూహ్య ఎత్తుగడను అమలు చేసింది. మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం మధ్యాహ్నం బీజేపీ ఎమ్మెల్సీలతో సమావేశం కావడం చర్చకు దారితీసింది. ఏపీ శాసన మండలిలో ప్రస్తుతం బీజేపీకి ఇద్దరు ఎమ్మెల్సీలు(మాధవ్, సోము వీర్రాజు) ఉన్నారు. వికేంద్రీకరణతోపాటు ఇతర బిల్లులకు కూడా మద్దతు ఇవ్వాల్సిందిగా బీజేపీ ఎమ్మెల్సీలను మత్రి బొత్స కోరారు.
ఆ ఇద్దరు ఏమన్నారంటే..
మంత్రి బొత్సతో భేటీలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్సీలు స్పష్టమైన సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. అన్ని ప్రాంతాల అభివృద్ధికి అనుకూలమే అయినప్పటికీ ఒక రాష్ట్రం ఒక రాజధాని బీజేపీ విధానమని, పార్టీ నిర్ణయానికే తాము కట్టుబడి ఉంటామని వారు స్పష్టం చేసినట్లు సమాచారం. మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తోన్న బీజేపీ.. కొత్త మిత్రుడు జనసేనతోకలిసి రాష్ట్రవ్యాప్త ఉద్యమాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
లైవ్ పై లొల్లి..
శాసన మండలి సమావేశాల ప్రత్యక్ష ప్రసారాల నిలిపివేతపై సభలో ఆందోళన వ్యక్తమైంది. కార్యక్రమాలు వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా సాగనంతమాత్రాన ప్రసారాలు నిలిపేయడం సరికాదని ప్రతిపక్ష ఎమ్మెల్సీలు మండిపడ్డారు. దీంతో మండలి లాబీల్లో ఉన్న టీవీలకు మాత్రం ప్రసారాలను పునరుద్ధరించారు.