బీసీ రిజర్వేషన్లలో భారీ కోత.. స్వాగతించిన వైసీపీ సర్కారు.. సీఎం బాధపడుతున్నా తప్పదంటూ..
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం 59.85 శాతం రిజర్వేషన్లు ఖరారు చేస్తూ వైసీపీ సర్కారు జారీ చేసిన జీవోను రాష్ట్ర హైకోర్టు కొట్టేసింది. రిజర్వేషన్లు 50 శాతం మించకుండా ఎన్నికలు నిర్వహించాలని, అందులో బీసీ రిజర్వేషన్లపై నెలరోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని కోర్టు తీర్పు చెప్పింది. రిజర్వేషన్ల తగ్గింపుపై జగన్ సర్కారు సుప్రీంకోర్టులో పోరాడాలన్న ప్రతిపక్ష టీడీపీ.. బీసీ రిజర్వేషన్లకు కోత పెడితే ఊరుకోబోమని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తన వైఖరిని వెల్లడించింది.
బొత్స కీలక ప్రకటన..
రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, 50 శాతానికి లోబడే స్థానిక ఎన్నికల ప్రక్రియ చేపడతామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తీర్పు అనంతరం అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ కుట్రల కారణంగానే రిజర్వేషన్లు తగ్గాయని ఆరోపించారు. ‘‘రాష్ట్రంలో బీసీల జనాభా ఎక్కువ ఉన్న కారణంగా, ఆయా వర్గాలకు న్యాయం దక్కేలా 59.85 శాతం రిజర్వేషన్లను ఖరారు చేశాం. కానీ కోర్టు తీర్పు అందుకు భిన్నంగా వచ్చింది. బీసీలకు న్యాయం చేయలేకపోతున్నామే అన్న బాధ సీఎం జగన్ తోపాటు మా అందరిలోనూ ఉంది. కానీ 30 రోజుల్లోగా ఎన్నికలు జరపాలన్న తీర్పు మేరకు మేం ముందుకు వెళతాం..''అని మంత్రి తెలిపారు.
కోత బీసీలకే..
కాగా, కోర్టు తీర్పు నేపథ్యంలో గతంలో ఇచ్చిన 59.85 శాతం రిజర్వేషన్ల జీవో స్థానంలో ప్రభుత్వం కొత్త జీవోను జారీచేయనుంది. రిజ్వేషన్లను 59.85 శాతం నుంచి 50 శాతానికే పరిమితం చేయనుంది. అయితే తగ్గింపునకు గురయ్యే 9.85 శాతాన్ని బీసీ కోటా నుంచే తీసేయబోతున్నట్లు తెలుస్తోంది. రాజ్యాంగం ప్రకారం ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లలో కోతలు విధించే వీలు లేకపోవడం.. గతంలో పెంచింది కూడా బీసీలకే కావడంతో.. మళ్లీ అదే బీసీలకు కోత విధించడం తప్ప ప్రభుత్వానికి మరో ప్రత్యామ్నాయం లేదనే వాదన వినబడుతోంది.
అతను చంద్రబాబు మనిషే..
59.85 శాతం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ వేసిన ప్రతాపరెడ్డి అనే వ్యక్తి టీడీపీ అధినేత చంద్రబాబుకు సన్నిహితుడని మంత్రి బొత్స తెలిపారు. బాబుతో ప్రతాపరెడ్డి కలిసున్న ఫొటోలను ఈ మేరకు మీడియాకు చూపెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోతే రాష్ట్రానికి 14వ ఫైనాన్స్ కమిషన్ నిధులు రాబోవని, అందుకే టీడీపీ కుట్రలు చేసిందని బొత్స ఆరోపించారు.
కాదు జగన్ మనిషే..
రిజర్వేషన్లపై హైకోర్టులో పిటిషన్ వేసిన ప్రతాపరెడ్డి.. టీడీపీ వ్యక్తేనన్నది తప్పుడు ప్రచారమని, నిజానికి అతను వైసీపీ సంబంధికుడే అనడానికి చాలా ఆధారాలున్నాయని టీడీఎల్పీ ఉప నేత అచ్చెన్నాయుడు చెప్పారు. కోర్టు తీర్పును అడ్డం పెట్టుకుని బీసీలకు కోటా కట్ చేయాలని జగన్ కుట్రలు చేస్తున్నారని, ఎట్టిపరిస్థితుల్లోనూ ఆయన ఆటలు సాగనివ్వబోమని అచ్చెన్న హెచ్చరించారు.