ఏపీలో పేదల ప్లాట్ల పంచాయితీ .. టీడీపీ ఆరోపణలు .. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన మంత్రి బుగ్గన
రాష్ట్రంలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని భావించిన వైసీపీ సర్కార్ అధికారం చేపట్టిన తర్వాత నుండి గత ఉగాది వరకే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించింది.అయితే కరోనావైరస్ వ్యాప్తి కారణంగా ఉగాదికి ఇళ్ళ స్థలాలు పంపిణీ జరగలేదు. జూలై 8న వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజున ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని భావించిన వైసీపీ సర్కార్ చేస్తోంది.
ఏపీలో రంగుల రాజకీయం .. వైసీపీ వర్సెస్ టీడీపీ .. సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారుగా !!
పేదలకు ఇచ్చే స్థలాల కోసం లంచాలు వసూలు చేస్తున్నారని టీడీపీ ఆరోపణ
ఇక నిరుపేదలకు ఇచ్చే స్థలాలను సేకరించే సమయంలో కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ప్రభుత్వం అవినీతికి పాల్పడుతున్నారని టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. ఇక ఈ విషయంలో చంద్రబాబు నిరుపేదలకు ఇళ్ళ స్థలం ఇవ్వడానికి లంచాలు వసూలు చేస్తున్నారంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. భూసేకరణ పేరుతో వైసీపీ నేతలు కోట్లు వసూలు చేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. రాజమండ్రిలో ఏడు లక్షలు విలువైన భూములు 45 లక్షలు పెట్టి కొన్నారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. ఒక్క చంద్రబాబు మాత్రమే కాదు దేవినేని ఉమా,యనమల రామకృష్ణుడు తదితరులు కూడా వైసీపీ సర్కార్ నిరుపేదలకు ఇచ్చే భూముల విషయంలో అవినీతికి పాల్పడుతున్నారని విమర్శిస్తున్నారు.
పేదలకు స్థలాలిస్తే బాబుకు బాధ .. చంద్రబాబు వ్యాఖ్యలకు బుగ్గన కౌంటర్
ఇక ఈ నేపథ్యంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చంద్రబాబు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో పేదలకు భారీగా ఇళ్ల స్థలాలు ఇస్తుంటే బాబుకు చాలా బాధగా ఉందని అందుకే ట్విట్టర్ ద్వారా అసత్యాలను ప్రచారం చేస్తున్నారని బుగ్గన పేర్కొన్నారు. చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ సోషల్ మీడియా వేదికగా అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చేస్తున్న ట్వీట్లలోని అంకెల వివరాలు అన్ని తప్పేనని లెక్కలు చెప్పారు బుగ్గన. చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో ఇళ్ళ నిర్మాణ పథకం లో తానేదో సాధించినట్టు చెప్తూ బురద జల్లుతున్నారని బుగ్గన ఆరోపించారు .
డబ్బులు వసూలు చేయడానికి కూడా శ్లాబులు ఉంటాయా?
సీఎం జగన్ పాలనలో ఇళ్ళస్థలం కావాలంటే లంచాలు ఇవ్వాల్సి వస్తుందని 30,000, 60,000, 1,50,000 అని చంద్రబాబు తానే రేట్లు నిర్ణయించి దందాలు జరుగుతున్నాయని చెబుతున్నారని బుగ్గన మండిపడ్డారు. డబ్బులు వసూలు చేయడానికి కూడా శ్లాబులు ఉంటాయా అంటూ ప్రశ్నించారు బుగ్గన.ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దాదాపు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించారని, అది భరించలేక ఇప్పుడు చంద్రబాబు ఈ విధంగా విమర్శలు చేస్తున్నారని మంత్రి బుగ్గన అన్నారు.
గ్రాఫిక్స్ లో ఇళ్ళు కట్టేస్తారు బాబు .. అప్పుడు చంద్రబాబు ఫిల్మ్ నడిచింది
ఇక చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో మొదటి రెండు సంవత్సరాలలో కేంద్రం నుంచి వచ్చిన గ్రౌండ్స్ తో తప్ప రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని పేర్కొన్నారు. ఇక అంతే కాదు అర్బన్ హౌసింగ్ కు సంబంధించి చంద్రబాబు మూడు వేల కోట్లు పెండింగ్ పెట్టి వెళ్లారని పేర్కొన్నారు. అసలు ఇల్లే కట్టకుండా గృహప్రవేశాలు కూడా చేయిస్తారని ఎద్దేవా చేశారు. గ్రాఫిక్స్ లో చాలా ఇళ్లు నిర్మించేశారని, గత ఐదేళ్లలో చంద్రబాబు ఫిల్మ్ నడిచిందని మంత్రి బుగ్గన పేర్కొన్నారు.
రాజమండ్రి భూములపై బుగ్గన క్లారిటీ .. బాబుకు సవాల్
వైయస్ రాజశేఖర్రెడ్డి హయాంలో 21 లక్షల ఇళ్లు నిర్మించారని, ఇక ఈ ఐదేళ్లలో 30 లక్షల ఇళ్లు నిర్మించాలనేది ప్రభుత్వ ధ్యేయమని చెప్పిన బుగ్గన రాజేంద్ర రెడ్డి భూసేకరణ చట్ట ప్రకారమే జరుగుతుందని పేర్కొన్నారు. రాజమండ్రి లో ఏడు లక్షల విలువైన భూములను 45 లక్షలు పెట్టి కొన్నారని చంద్రబాబు చేసిన ఆరోపణలు నిజం కాదని రాజమండ్రిలో ఎక్కడైనా పదిలక్షలకైనా భూమి ఇప్పిస్తే తీసుకుంటామని బుగ్గన చంద్రబాబుకు సవాల్ విసిరారు.
Recommended Video
పెట్టుబడిలేని ట్విట్టర్ లో చంద్రబాబు పనికిమాలిన ఆరోపణలు
పెట్టుబడి లేని ట్విట్టర్ ఉంది కదా అని తప్పుడు సమాచారం ఇవ్వద్దని, ఇక టిడిపి నేత లోకేష్ తెలిసీ తెలియక మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. అసత్యాలు చెప్తూ ప్రజలను గందరగోళానికి గురి చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు మంత్రి బుగ్గన . వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా సంక్షేమ పాలన తట్టుకోలేకనే ఇన్ని రాజకీయాలు చేస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబుపై, టిడిపి నేతలపై విరుచుకుపడ్డారు.