చంద్రబాబు వల్లే పోలవరం తిప్పలు .. మూడు రాజధానులపై గందరగోళం అందుకే : మంత్రి బుగ్గన
ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏపీలో తాజా పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి, మూడు రాజధానులకు సంబంధించి వ్యాఖ్యలు చేసిన ఆయన చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్ మారిన అంచనాలకు తగినట్టుగా కేంద్రం కచ్చితంగా ఆర్థిక సహాయం చేస్తుందని నమ్మకం ఉందని మంత్రి బుగ్గన పేర్కొన్నారు. గత ప్రభుత్వం అనాలోచితంగా నిర్ణయాలు తీసుకుందని, పర్యవసానంగా కలిగే ఆర్థిక భారాన్ని అంచనా వేసుకోకుండా చేసుకున్న ఒప్పందాల వల్ల రాష్ట్రానికి తీరని నష్టం కలిగే అవకాశం ఉందని మంత్రి బుగ్గన పేర్కొన్నారు.
బాబు ప్రభుత్వ తప్పిదాల వల్లే పోలవరం ప్రాజెక్ట్ నిధులకు కేంద్రం కొర్రీలు: మంత్రి అనిల్ కుమార్ యాదవ్
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ కాంట్రాక్ట్ కోసం బాబు చేసుకున్న ఒప్పందాలతోనే ఇబ్బందులు
గతంలో పోలవరం ముంపు గ్రామాల ప్రజలు 25 వేల కుటుంబాలు కాగా, ఇప్పుడు లక్ష కుటుంబాల వరకు అయ్యారని మంత్రి బుగ్గన తెలిపారు. ప్రారంభంలో లక్ష ఎకరాల సేకరణ అనుకుంటే, అది కాస్త లక్షన్నర ఎకరాలు అయిందంటూ స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ కాంట్రాక్ట్ కోసం గత ప్రభుత్వం అనాలోచితంగా అన్నిటికీ ఒప్పుకుందని, ఇప్పుడు ముంపు గ్రామాలకు పరిహారం విషయంలో రాష్ట్రం మోయలేని పరిస్థితి నెలకొందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
పోలవరం నిర్మాణం కోసం కేంద్రం దగ్గర రాష్ట్రం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయని ఆశాభావం
ప్రాజెక్టుల అంచనాల వ్యయం కూడా 2013-2014 ఆర్థిక సంవత్సరంలో ధరలు ఉన్నాయని చెప్పిన మంత్రి ప్రస్తుతం అంచనాలు కూడా విపరీతంగా పెరిగాయని స్పష్టం చేశారు. ఈ విషయంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా చెబుతున్న విషయాలను అర్థం చేసుకుంటుందని, ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలనిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న వాదనలో వాస్తవం లేదని మంత్రి బుగ్గన పేర్కొన్నారు.
చంద్రబాబులా అంతర్జాతీయ స్థాయిలో కాకున్నా .. నాణ్యంగానే
చంద్రబాబు హయాంలో అమరావతి అభివృద్ధి కోసం బడ్జెట్లో ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించి, 50 వేల కోట్లకు టెండర్లు పిలవడం ఏమిటని ప్రశ్నించిన మంత్రి బుగ్గన, చంద్రబాబు పేపర్ల మీద చూపించిన మాదిరిగా అంతర్జాతీయ స్థాయిలో రోడ్లు వేయలేమని, విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాలలో అత్యుత్తమ నాణ్యమైన రోడ్లనే వేస్తామంటూ మంత్రి బుగ్గన పేర్కొన్నారు. ఇక అమరావతి నిర్మాణానికి లక్ష కోట్లు చంద్రబాబు కావాలన్నారు అని, అంత డబ్బు ఎక్కడుంది అంటూ ప్రశ్నించారు బుగ్గన.
మూడు రాజధానులు ఆలోచనను అర్థం చేసుకోవడంలోనే గందరగోళం
గత ప్రభుత్వ హయాంలో ఇవ్వాల్సిన బకాయిలను నెమ్మదిగా చెల్లిస్తామని పేర్కొన్న ఆయన చంద్రబాబు రాష్ట్రానికి అప్పుల భారం పెట్టారని, ఎన్నికలకు ముందు ఇష్టారాజ్యంగా పథకాలను అందించి రాష్ట్రం పై పెనుభారం మోపారని ఆరోపించారు. సీఎం జగన్ మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి గురించి ఆలోచించారని, ఏ ప్రాంత ప్రజలు అయినా నిర్లక్ష్యానికి గురయ్యారు అనే భావనకు లోను కాకూడదని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసే 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారని బుగ్గన పేర్కొన్నారు. మూడు రాజధానులు ఆలోచనను అర్థం చేసుకోవడం లోనే గందరగోళం ఉందని పరిపాలన సౌలభ్యం కోసమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు సమ ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు.