బుగ్గనకు హైకోర్టు షాక్, పీఏసీ చైర్మన్గా ఉండి ఇలాగా.. దేవినేని
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. రాయలసీమ తాగు, సాగు నీటి కష్టాలను తీరుస్తుందని భావిస్తున్న గాలేరు - నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు విషయంలో బుగ్గన చేసిన వాదన తప్పని తేలింది!
ఈ ప్రాజెక్టు కోసం కర్నూలు జిల్లా చెర్వుపల్లి గ్రామంలో సేకరించదలచిన దాదాపు తొమ్మిది ఎకరాల భూమి ప్రయివేటు వ్యక్తులది అని చెబుతూ గత ఏడాది బుగ్గన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు.. తుది తీర్పు వెలువడే దాకా ఆ భూమికి సంబంధించిన సేకరణను నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే బుగ్గన వాదన తప్పని రెవెన్యూ, జలనవరుల శాఖ అధికారులు హైకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ చేసిన వాదనను సమర్థించింది.
బుగ్గన ఆరోపించినట్లుగా ఆ భూమి ప్రయివేటు వ్యక్తులది కాదని చెప్పిన న్యాయస్థానం, ఆ భూమిని సేకరించుకోవచ్చిన ఏపీ ప్రభుత్వానికి పచ్చ జెండా ఊపింది. ఈ నేపథ్యంలో గాలేరు- నగరి ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణకు అడ్డంకులు తొలగిపోయాయి.
హైకోర్టు తీర్పు నేపథ్యంలో మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు.. బుగ్గన పైన మంగళవారం నాడు నిప్పులు చెరికారు. బాధ్యత గల పీఏసీ చైర్మన్ పదవిలో ఉన్న బుగ్గన ప్రాజెక్టులకు అవసరమైన భూముల సేకరణకు సహకరించాల్సింది పోయి అడ్డంకులు కలిగిస్తున్నారన్నారు. భూసేకరణను అడ్డుకునేందుకు బుగ్గన యత్నించారని, న్యాయపరమైన చిక్కులు కల్పించారని మండిపడ్డారు.