అవినీతిలో టాప్, వైయస్ అదృశ్యమైనప్పుడే జగన్ అలా: దేవినేని, నారాయణ నిప్పులు
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, నారాయణలు వేర్వేరు మీడియా సమావేశాల్లో తీవ్రస్తాయిలో విరుచుకుపడ్డారు. అవినీతిలో విపక్ష నేత వైయస్ జగన్మోహన్రెడ్డి టాప్ టెన్లో ఉన్నారని దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు.
జగన్ కుట్ర
శనివారం విజయవాడలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో దేవినేని మాట్లాడుతూ... రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి జగన్ కుట్ర పన్నాడన్నారు. అలాగే రాష్ట్రంలో నిర్మితమవుతున్న ఆయా ప్రాజెక్టులపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి అన్నారు. పట్టిసీమపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని, దీనిద్వారా లక్షలాది ఎకరాలు సాగవుతున్నాయని మంత్రి పేర్కొన్నారు.
వైయస్ అదృశ్యమైనప్పుడే..
జగన్మోహన్ రెడ్డి అవినీతి వల్లే పోలవరం ప్రాజెక్టు వ్యయం పెరిగిందని మంత్రి దేవినేని ఆరోపించారు. హెలికాప్టర్ ప్రయాణంలో దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి అదృశ్యమైన రోజునే జగన్ పోలవరం ప్రాజెక్టుకు కొత్త టెండర్లు వేశారని ఆరోపించారు. తాము అడిగే ప్రశ్నలకు జవాబు ఇవ్వకుండా టీడీపీపై బురదజల్లుతున్నారని దేవినేని మండిపడ్డారు.
ఒక్క సీటు కూడా రాదు
2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరి నారాయణ అన్నారు. శనివారం ఆయన నెల్లూరులో పర్యటించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ... నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజలు వైసీపీని తిరస్కరించారన్నారు.
నెల్లూరుకు 30వేల ఇళ్లు..
నెల్లూరు నగరానికి 30 వేల ఇళ్లు మంజూరు చేశామని, అవసరమైతే మరో 10 వేల ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. అలాగే ఎన్టీఆర్ గృహాల నిర్మాణంలో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం వాడుతున్నామని మంత్రి తెలిపారు. నెల్లూరులో పర్యటించిన మంత్రి నూతనంగా చేపడుతున్న ఎన్టీఆర్ గృహ నిర్మాణాలను పరిశీలించారు.