క్షమాపణ చెప్పాల్సిందే: కలెక్టర్పై వైయస్ జగన్ వ్యాఖ్య దుమారం
అధికారులు, పోలీసులు అందరూ అవినీతిపరులేనని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విజయవాడ: అధికారులు, పోలీసులు అందరూ అవినీతిపరులేనని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ప్రతిపక్ష నేత పైన తీవ్రంగా మండిపడ్డారు. అందరూ అవినీతిపరులేనని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. నందిగామ ఆసుపత్రిలో జగన్ రౌడీలా ప్రవర్తించారని ఆరోపించారు.
ప్రభుత్వాధికారులను జగన్ ఇష్టానుసారంగా దుర్భాషాలాడారని, వారికి జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీ టీడీపీ అధ్యక్షులు కళా వెంకట్రావు కూడా స్పందించారు. జగన్ అధికారులకు, పోలీసులకు క్షమాపణ చెప్పాలన్నారు.
కలెక్టర్ బాబు పైన జగన్ దురుసు ప్రవర్తనను ఖండిస్తున్నట్లు కృష్ణా జిల్లా అధికారుల సంఘం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. పోలీసులు అందరూ అవినీతిపరులేనని జగన్ వ్యాఖ్యానించడం సరికాదని కృష్ణా జిల్లా పోలీ అధికారుల సంఘం ఆక్షేపించింది.
కాగా, కృష్ణా జిల్లా ముళ్లపాడు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందారు. ప్రమాదం జరిగిన బస్సు దివాకర్ ట్రావెల్స్కు చెందినది.
ఏం జరిగిందంటే...
'గో బ్యాక్ జగన్': చేదు అనుభవం, జగన్ ఉన్న గదికి దూసుకెళ్లారు
నందిగామ ఏరియా ఆసుపత్రిలోని మార్చురీ గదిలో మృతదేహాలను పరిశీలించేందుకు లోపలికి వెళ్లిన జగన్ అక్కడే ఉన్న డాక్టర్లను పోస్ట్ మార్టం నివేదికలివ్వాలని అడిగారు. వాటిని పరిశీలించాక తిరిగి ఇవ్వాలని డాక్టర్లు చెప్పారు. దానికి జగన్ నిరాకరించారు.
ఇవి వైద్యులకు సంబంధించిన కాపీలని, వేరేవి ఇస్తామని అధికారులు చెప్పారు. కానీ జగన్ వినలేదని అంటున్నారు. అదే సమయంలో అక్కడే ఉన్న కలెక్టర్ బాబు స్పందించారు.
ఆ నివేదికలను తిరిగివ్వాలని కోరారు. దీంతో జగన్ కలెక్టర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల నుంచి కలెక్టర్ వరకూ అందరి అవినీతిపైనా దర్యాప్తు చేయిస్తామని, నిన్ను కూడా సెంట్రల్ జైలుకు తీసుకెళ్లే కార్యక్రమం చేపడతామని కలెక్టర్ బాబును హెచ్చరించారు. దీనిపై టిడిపి నేతలు, మంత్రులు, అధికారులు స్పందించారు.
సీఎంకు అధికారుల వివరణ
ముళ్లపాడు రోడ్డు ప్రమాదం నేపథ్యంలో సచివాలయంలో అధికారులతో సీఎం చంద్రబాబు మంగళవారం సమావేశమయ్యారు. డ్రైవర్ నిద్రమత్తులోకి వెళ్లడం, లేదంటే మలుపు వద్ద రోడ్డును సరిగా అంచనావేయలేక, వేగం కారణంగా బండిని నియంత్రించలేకపోవడం వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని రవాణాశాఖ అధికారులు సీఎంకు వివరించారని తెలుస్తోంది.
రాష్ట్ర రహదారుల్లో ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని, రూ. మూడు వేల కోట్ల వ్యయం అయ్యే ఈ ప్రాజెక్టుకు రుణం ఇవ్వడానికి ప్రపంచ బ్యాంకు సుముఖంగా ఉందని వివరించారు.
తక్షణమే ఆ ఫైల్ను తన వద్దకు పంపాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. జాతీయదారుల్లో మలుపులు, కల్వర్టులు వంటి ప్రమాదకర ప్రాంతాలను అప్రమత్తం చేసే హెచ్చరిక బోర్డులు తగినన్ని లేవని, దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయని రవాణాశాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం అన్నారు.