జగన్ ని దులిపేసిన దేవినేని ఉమా...బీజేపీని కడిగేసిన గల్లా జయదేవ్
అమరావతి: ప్రతిపక్షనేత జగన్పై మంత్రి దేవినేని ఉమా మరోసారి మండిపడ్డారు. అమరావతి, పోలవరంపై జగన్ నిత్యం ఆరోపణలు చేస్తున్నారని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి, పోలవరం పూర్తయితే జగన్ అడ్రస్ గల్లంతవుతుందని ఎద్దేవాచేశారు.
మరోవైపు ఎంపి గల్లా జయదేవ్ కూడా బిజెపిపై మరోసారి విమర్శల వర్షం కురింపించారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ ఎపిని మోసం చేస్తే, విభజన హామీలు అమలు చేయకుండా బీజేపీ ద్రోహం చేసిందని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని, విద్యార్థులు కూడా పోరాటానికి మద్దతుగా ఉండాలని జయదేవ్ ఈ సందర్భంగా కోరారు.
అమరావతి లో మీడియాతో మాట్లాడిన మంత్రి దేవినేని ఉమ ప్రతిపక్ష నేత, వైసిపి అధ్యక్షుడు జగన్ ను ఘాటైన విమర్శలతో దుయ్యబట్టారు. అసలు వచ్చే ఎన్నికల్లో జగన్కు ప్రతిపక్ష హోదా కూడా రాదని ఉమా జోస్యం చెప్పారు. ఏపీలోని ప్రాజెక్టులు, డ్యామ్లలో జలకళ కన్పిస్తోందని, ఇప్పటివరకు గోదావరి నుంచి 1340 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిశాయని మంత్రి ఉమ తెలిపారు.
అయితే రాయలసీమలో తీవ్ర వర్షాభావ పరిస్థితి ఉందని, రాష్ట్రవ్యాప్తంగా 24 లక్షల హెక్టార్లలో పంటలు వేశారని మంత్రి ఉమ వెల్లడించారు. 2019 సంక్రాంతి నాటికల్లా వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీరిస్తామని మంత్రి దేవినేని ఉమా ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
మరోవైపు విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదంటూ ఎంపీ గల్లా జయదేవ్ మరోసారి కేంద్రంపై ధ్వజమెత్తారు. అమరావతికి విచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ ఎపిని మోసం చేస్తే...కేంద్రం విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్రానికి ద్రోహం చేసిందని గల్లా ఆరోపించారు. ఈ విషయమై కేంద్రంపై ఎన్నో విధాలుగా ఒత్తిడి చేసిన ఫలితం లేకపోయిందన్నారు.
అందుకే ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్నామని గల్లా చెప్పుకొప్పారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడేదిలేదని ఆయన తేల్చిచెప్పారు. బీజేపీ కూడా కాంగ్రెస్లాగే స్వప్రయోజనాల కోసం ప్రయత్నిస్తే.. ఏపీ ప్రజలేం అమాయకులు కాదని జయదేవ్ కేంద్రాన్నిహెచ్చరించారు. కేంద్రం చేయాల్సినంత సాయం చేసి ఉంటే ఏపీ పరిస్థితి మరోలా ఉండేదని గల్లా ధ్వజమెత్తారు.
Recommended Video
ఉమ్మడి ఏపీకి హైదరాబాద్ ఆదాయ వనరుగా ఉండేదని, హైదరాబాద్లో అన్ని ప్రాంతాల వారు పెట్టుబడులు పెట్టారని గల్లా గుర్తుచేశారు. హైదరాబాద్ తెలంగాణకు పోవడం వల్ల ఏపీ ఆదాయం లేని రాష్ట్రంగా మిగిలిపోయిందని చెప్పారు. విభజనతో 90 శాతం జాతీయ సంస్థలు తెలంగాణలోనే ఉండిపోయాయన్నారు. ఏపీ అభివృద్ధి రేటు 13 శాతం ఉన్నా తలసరి ఆదాయం గణనీయంగా తగ్గిందని గల్లా వివరించారు.