కమలదళం నీళ్లు చల్లుకునే నువ్వా?.. విషం చిమ్ముతున్నావ్: జగన్ పై దేవినేని
మచిలీపట్నం: మచిలీపట్నం పోర్టు కోసం అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 4800ఎకరాల భూసేకరణ చేయాలని భావిస్తే.. ఆనాడు చంద్రబాబు అడ్డుపడ్డారని ప్రజాసంకల్పయాత్రలో జగన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. పోర్టుకు కేవలం 1800ఎకరాలు సరిపోతాయని ఆనాడు చెప్పిన చంద్రబాబే.. అధికారంలోకి వచ్చాక రాత్రికి రాత్రే 33వేల ఎకరాలకు నోటిఫికేషన్ ఇచ్చారని ఆరోపించారు.
జగన్ చేసిన ఈ ఆరోపణలపై మంత్రి దేవినేని ఉమా స్పందించారు. వందకోట్లు తీసుకుని గిలకలదిండి- గోగిలేరుకు పోర్టును వైఎస్ అమ్మేస్తే.. పోరాడి దాన్ని మచిలీపట్నానికి తెచ్చుకున్నామని ఆయన అన్నారు. పోర్టు 4,800 ఎకరాల్లో మాత్రమే నిర్మితమవుతుందని, రైతుల అంగీకారంతోనే భూములు తీసుకుంటామని అన్నారు.
పనులు యుద్దప్రాతిపదికన జరిపించి వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి మచిలీపట్నం ప్రజలు పోర్టులో తొలి నౌకను చూసేలా చేస్తామని వెల్లడించారు. ప్రతీ శుక్రవారం కమలదళం నీళ్లు చల్లుకునే జగన్ కోర్టుకు హాజరవుతున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. ఇక వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెంగళూరులో బీజేపీ కండువా కప్పుకుని, విశాఖలో మాత్రం నల్ల కండువా కప్పుకున్నారని అన్నారు.
Recommended Video
జగన్ నుంచి సీబీఐ జప్తు చేసిన ఆస్తులను విక్రయిస్తే రాష్ట్ర ప్రజలకు కార్లు, కేజీ బంగారం కొనిపెట్టవచ్చునని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేతగా జగన్.. ఎన్నడైనా రాష్ట్ర ప్రాజెక్టుల గురించి, ప్రజా ప్రయోజనాల గురించి మాట్లాడారా? అని ప్రశ్నించారు. పట్టిసీమ ప్రాజెక్టుతో రైతులకు సాగునీరు అందుతుంటే.. జగన్ మాత్రం నీళ్లు రావడం లేదంటూ విషం చిమ్ముతున్నారని విమర్శించారు.