కియాపై క్లారిటీ.. ఇక విస్తరణ కోసం భేటీ: దక్షిణ కొరియా పర్యటనకు మంత్రి మేకపాటి..!
అమరావతి: కియా.. దక్షిణ కొరియా. రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వినిపిస్తోన్న పేరు ఇది. అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం పరిధిలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ టాప్ దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ తన ప్లాంట్ను తమిళనాడుకు తరలిస్తుందంటూ వార్తలు రావడం..దానిపై తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించడం..అలాంటి ప్రయత్నమేదీ చేయట్లేదంటూ కియా సంస్థ యాజమాన్యం క్లారిటీ ఇవ్వడం.. వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
ఏపీ నుంచి కియా మోటార్స్ తరలింపు: తమిళనాడు సర్కారు ఏమందంటే..?
16 నుంచి మూడు రోజుల పాటు..
ఈ పరిస్థితుల్లో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.. దక్షిణ కొరియా పర్యటనకు బయలుదేరి వెళ్లబోతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నెల 16వ తేదీ నుంచి మూడు రోజుల పాటు గౌతమ్ రెడ్డి దక్షిణ కొరియాలో పర్యటిస్తారు. ఈ మేరకు ఆయన పర్యటనకు విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి లభించినట్లు సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ వెల్లడించారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులను జారీ చేశారు.
కియా ప్లాంట్ విస్తరణ కోసం..
అనంతపురంలో కియా కార్ల తయారీ కేంద్రం తమిళనాడుకు తరలిపోతోందంటూ రాయిటర్స్ సంస్థ కథనాన్ని ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ సహా ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు విస్తృతంగా ప్రచారం చేశారు. వాటికి చెక్ పెట్టేలా గౌతమ్ రెడ్డి దక్షిణ కొరియా పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నట్లు చెబుతున్నారు. అనంతపురంలోనే కియా కార్ల తయారీ ప్లాంట్ను విస్తరించేలా చర్యలు తీసుకోవాలని ఆయన భావిస్తున్నారు.
కడప స్టీల్ప్లాంట్లో పెట్టుబడులు పెట్టేలా..
తన పర్యటన సందర్భంగా కియా యాజమాన్యంతో పాటు డాంగ్జిన్ స్టీల్ప్లాంట్, దాని అనుబంధ సంస్థల ప్రతినిధులతో మేకపాటి భేటీ కానున్నారు. కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కిందటి నెల స్టీల్ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇందులో పెట్టుబడులు పెట్టాలని కోరుతూ గౌతమ్ రెడ్డి డాంగ్జిన్ స్టీల్ప్లాంట్ సంస్థ ప్రతినిధులతో భేటీ అవుతారు. అలాగే ఆటొమొబైల్, ఎలక్ట్రానిక్, టెక్స్టైల్స్, గార్మెంట్స్, ఫుడ్ ప్రాసెసింగ్, కెమికల్, ఫార్మా పరిశ్రమల యాజమాన్యాన్ని కలుసుకుంటారు.