మేకను కోసుకుతింటే మటన్ పార్టీ...మనిషిని కోసుకుతింటే బీజేపీ పార్టీ:మంత్రి గంటా
అమరావతి: ఏపిలో టిడిపి, బిజెపిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది...వేదిక ఏదనేది కాకుండా ఈ రెండు పార్టీల నేతలు ఎక్కడ ఎదురైనా తీవ్రమైన విమర్శలతో పరస్పరం విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు.
ఈ క్రమంలోనే బుధవారం ఏపీ శాసన మండలిలో టీడీపీ-బీజేపీల నేతల మధ్య వాగ్యుద్దం నడిచింది. కేంద్ర విద్యా సంస్థల ఏర్పాటు అంశంపై మంత్రి గంటా శ్రీనివాసరావు, బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్లు పరస్పరం మాటల దాడి జరిగింది. ఒక దశలో ఆగ్రహంతో ఊగిపోయిన గంటా.."బీజేపీ పార్టీ అంటేనే మనుషులను కోసుకుని తినే పార్టీ" అని వ్యాఖ్యానించారు. దీంతో సభలో కలకలం రేగింది. మంత్రి గంటా వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
వివరాల్లోకి వెళితే...ఏపి విభజన చట్టంలో పేర్కొన్న జాతీయ స్థాయి విద్యా సంస్థల ఏర్పాటు ప్రక్రియపై బుధవారం శాసన మండలిలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ...17 జాతీయ సంస్థలకు గానూ ఏపీ ప్రభుత్వం 3508 ఎకరాలు కేటాయించిందని, వీటిలో ప్రస్తుతానికి 5 విద్యా సంస్థల్లో క్లాసులు నడుస్తున్నాయని చెప్పారు. అయితే శాశ్వత నిర్మాణాలు పూర్తికానందున వీటిని కూడా తాత్కాలిక భవనాల్లోనే నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
అదే క్రమంలో కేంద్ర ప్రభుత్వం వైఖరి గురించి మాట్లాడుతూ బిల్డింగ్స్ లేని కారణంగా సీట్లు నిండటంలేదని,నిర్మాణాలు చేపట్టమని కేంద్రాన్ని అడిగితే స్థలం ఇవ్వలేదని సాకులు చెబుతోందన్నారు. ఇదే విషయమై చాలా సార్లు కేంద్ర మంత్రిని కలిసినా ఫలితం లేకుండా పోయిందని అంటూ..."అధ్యక్షా...కేంద్ర ప్రభుత్వం కావాలనే ఏపీపై కక్షకట్టి అన్యాయం చేస్తోంది...కోడి కోసుకుని తింటే అది చికెన్ పార్టీ, మేకను కోసుకుని తింటే అది మటన్ పార్టీ, అదే మధ్యతరగతి మనిషిని కోసుకుని తింటే అది భారతీయ జనతాపార్టీ"...అని మంత్రి గంటా వ్యాఖ్యానించడంతో సభలో ఒక్కసారిగా అలజడి రేగింది.
మంత్రి గంటా వ్యాఖ్యలపై మండిపడిన బిజెపి నేతలు అందుకు తీవ్రంగా ప్రతిస్పందించారు. బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ..."తలుచుకుంటే మీకన్నా ఎక్కువే అనగలం...కానీ ఇది అసెంబ్లీ అనే సంగతి మర్చిపోవద్దు...మంత్రిగా ఉన్న వ్యక్తి ఇంత అనుచితంగా మాట్లాడటం సరికాదు"...అన్నారు. మంత్రి గంటా బిజెపిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.