మంత్రి గంటా బంధువు సంచలనం:అనకాపల్లి నుంచి పోటీ చేసి తీరుతా!
విశాఖపట్టణం:మంత్రి గంటా శ్రీనివాసరావుకు సమీప బంధువు అయిన పరుచూరి భాస్కరరావు వ్యాఖ్యలు టిడిపిలో కలకలం సృష్టిస్తున్నాయి. ఎవరు ఔనన్నా కాదన్నా వచ్చే ఎన్నికల్లో తాను అనకాపల్లి అసెంబ్లీ స్థానానికి పోటీచేసి తీరుతానని మంత్రి గంటా బంధువు, అనకాపల్లి టిడిపి నేత పరుచూరి భాస్కరరావు స్పష్టం చేశారు.
ఆదివారం అనకాపల్లి మండలంలోని బయ్యవరం ప్రమీలారాణితోటలో ఆయన తన మద్దతుదారులతో నియోజవర్గస్థాయి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ప్రాధాన్యత గుర్తించి ఏ రాజకీయ పార్టీ టికెట్ ఇచ్చినా పోటీ చేస్తానని, ఒకవేళ ఏ పార్టీ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా నైనా బరిలోకి దిగడం ఖాయమని కుండబద్దలు కొట్టారు.
ఈ క్రమంలోనే అనకాపల్లి నియోజకవర్గ ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి త్వరలో 'పల్లెపల్లెకు పరుచూరి' అనే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు పరుచూరి ప్రకటించారు. అలాగే అన్ని గ్రామాల్లో పర్యటించడమే కాకుండా ఆయా గ్రామాల్లో 'పల్లె నిద్ర' కూడా చేస్తానని స్పష్టం చేశారు. 1999లో గంటా శ్రీనివాసరావు అనకాపల్లి ఎంపీగా గెలిచినప్పటి నుంచి తనకు ఈ నియోజకవర్గం ప్రజలతో అనుబంధం ఉందని పరుచూరి భాస్కరరావు తెలిపారు. అలాగే మంత్రి గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా గెలుపొందిన అన్ని నియోజకవర్గాలకు తాను ఇన్చార్జిగా పనిచేశానని తన రాజకీయ అనుభవం గురించి వివరించారు.
అనకాపల్లి నియోజకవర్గంలోని తన అభిమానుల కోరిక మేరకు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేయాలని నిర్ణయించుకున్నట్టు పరుచూరి భాస్కరరావు వెల్లడించారు.మరోవైపు మంత్రి గంటా శ్రీనివాసరావుకు సోదరుడి వరసయ్యే పరుచూరి భాస్కరరావు తాజా ప్రకటనలపై టిడిపిలో కలకలం రేగుతోంది. అనకాపల్లి టిడిపి నేత అయిన పరుచూరి భాస్కరరావు పలు సందర్భాల్లో ఏ పార్టీ టికెట్ నుంచైనా పోటీ చేస్తానని ప్రకటిస్తుండటంపై ఆయన లోపాయికారీగా మరో పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నారా అనే విషయమై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
పరుచూరి భాస్కరరావు పై గతంలో మంత్రి అయ్యన్నపాత్రుడు సిట్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆనందపురం మండలం వేములవలసలో ప్రభుత్వ భూములను తమవిగా చూపి మంత్రి సమీప బంధువు పరుచూరి భాస్కరరావు ఇండియన్ బ్యాంకు నుంచి రూ.190 కోట్లు తీసుకున్నారని అయ్యన్న సిట్కు ఫిర్యాదుచేసినట్లు తెలిసింది. ఒకవైపు మంత్రి అయ్యన్నపాత్రుడు విశాఖ పశుగణాభివృద్ది సంస్థ లో అక్రమాల పేరిట పరోక్షంగా మంత్రి గంటాపై ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మరోవైపు పరుచూరి భాస్కరరావు ప్రకటనలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి.