మంత్రి గంటా గోడ మీద పిల్లి...ఇప్పుడు వైసిపితో టచ్ లో:విజయసాయి రెడ్డి
విశాఖపట్టణం:మంత్రి గంటా శ్రీనివాసరావు గోడ మీద పిల్లి లాంటి వారని...ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనుకుంటే ఆయన అక్కడకు చేరిపోతారని వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
గ్రేటర్ విశాఖ పరిధిలో పాదయాత్ర చేస్తున్న వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎన్నో పార్టీలు మారిన గంటా ఇప్పుడు వైఎస్సార్సిపిలోకి రావడానికి సంప్రదింపులు జరుపుతున్నాడని విజయసాయి రెడ్డి చెప్పుకొచ్చారు. గంటా శ్రీనివాసరావుకు డబ్బే ప్రధానమని, నీతి నియమాలనేవే లేని గంటా విమర్శించేందుకు కూడా అర్హుడు కారని విజయసాయిరెడ్డి అన్నారు.
విశాఖపట్టణంలో మంగళవారం జరిగిన ధర్మపోరాట సభ అధర్మ సభ, అన్యాయమైన సభ అని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. స్వలాభం, స్వార్ధం, ప్రచారం కోసం అధికార దుర్వినియోగానికి టిడిపి ప్రభుత్వం పాల్పడిందని ఆయన ఆరోపించారు. రాజకీయ సభలను విశ్వవిద్యాలయంలో నిర్వహించరాదన్న జీవో ఉన్నప్పటికీ అనుమతి ఇచ్చి వీసీ, రిజిస్ట్రార్ నిబంధనలను యధేచ్చగా ఉల్లంఘించారని అన్నారు. అయితే ఇదే ప్రాంగణాన్ని తాము గతంలో అడిగితే వైసిపికి ఇవ్వలేదని, మరి ఇప్పుడెలా ఇచ్చారని నిలదీశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నష్ట జాతకుడని, ఆయన అధర్మ పోరాటం చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయాలన్ని అపవిత్రం చేశారని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. దాన్ని గంగాజలంతో శుద్ధి చేద్దామంటే పోలీసులు అడ్డుకున్నారని, రాష్ట్రంలో పోలీసులు టిడిపి కార్యకర్తల్లా పని చేస్తున్నారని విమర్శించారు. గతంలో విశాఖ సీపీ యోగానంద్ ఎయిర్పోర్టు రన్పైనే వైఎస్ జగన్ను అడ్డుకున్న ఘటనపై పార్లమెంటు సభా హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. అలాంటి యోగానంద్ కులపిచ్చితో పోలీసులను తెలుగుదేశం కార్యకర్తల్లా వాడుకుంటున్నారని ఆరోపించారు.
Recommended Video
చంద్రబాబు ఓ దొంగ అని, ప్రజలను మభ్యపెట్టి డ్రామాలాడే వ్యక్తి అని అందరికీ తెలుసని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాన్ని అణగదొక్కడం, పార్టీ మీద, కార్యకర్తల మీద, సానుభూతిపరులైన సోషల్మీడియా వ్యక్తుల మీద దొంగ కేసులు పెట్టడం ద్వారా వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారం దక్కించుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విజయసాయి రెడ్డి ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై బురద జల్లేందుకు ఢిల్లీ నుంచి కుట్ర రాజకీయాలు సాగుతున్నాయని మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. తిరుమల ఆలయం ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి ధ్వజమెత్తారు. విశాఖలో ధర్మపోరాట సభ విజయవంతమైన నేపథ్యంలో వైకాపా నేతలు ఓర్చుకోలేక ఆ స్థలం వద్ద నిరసన చేపట్టారని ఎద్దేవా చేశారు. వైసిపి ఇటువంటి చర్యలకు దిగడంపై అభ్యంతరం తెలిపారు. వైకాపా అండతోనే భాజపా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుందని మండిపడ్డారు. విభజన హామీలు నెరవేర్చే వరకు తమ పోరు ఆపేదిలేదని గంటా ఈ సందర్భంగా స్పష్టంచేశారు.