గంటా, తోట త్రిమూర్తులు..దారెటు?
అమరావతి: ఎన్నికల ముంగిట్లో అధికార తెలుగుదేశం పార్టీ డీలా పడుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి మరికొన్ని రోజులే మిగిలి ఉన్న పరిస్థితుల్లో ఆ పార్టీని వదిలి వెళ్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తుండటం వల్ల ఒక్కరొక్కరుగా పార్టీని వీడుతున్నారని సమాచారం. నియోజకవర్గం పరిధిలో తనను నమ్ముకున్న వారితో చర్చించిన తరువాత పార్టీని వీడుతున్నారు.
తాజాగా విశాఖపట్నం జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా తెలుగుదేశాన్ని వీడే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గంటాకు ఆప్తమిత్రుడిగా పేరున్న అవంతి శ్రీనివాస్ ఈ విషయాన్ని ఆఫ్ ది రికార్డ్ గా చెబుతున్నారు. గంటా శ్రీనివాసరావు పార్టీలో ఎక్కువ రోజులు ఉండకపోవచ్చని ఆయన అంటున్నారు.
ఏ పార్టీలో చేరుతారనే విషయం తనకూ తెలియదని, వైఎస్ఆర్ సీపీలో చేరాలని తాను గంటాను సూచిస్తున్నట్లు అవంతి శ్రీనివాస్ చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున 2014 ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి గెలిచిన అవంతి శ్రీనివాస్.. గురువారమే ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పార్టీ అగ్ర నాయకులతో అసంతృప్తిగా ఉన్నారని, టీడీపీని వీడటానికి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. ఈ దిశగా ఆయన రెండు రోజులుగా తన నియోజకవర్గంలో కార్యకర్తలతో విస్తృతంగా చర్చిస్తున్నారు.
అయిదు సీట్లు ఇస్తామని మూడే ఇచ్చిన టీడీపీ..
గంటా శ్రీనివాస రావుకు ఉత్తరాంధ్రలో కీలక నాయకునిగా గుర్తింపు ఉంది. అలవోకగా పార్టీలను ఫిరాయిస్తారనే అపవాదును కూడా ఆయన మోస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీలో లోక్ సభ, శాసనసభకు ఎన్నికయ్యారు. ప్రముఖ నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని పెట్టిన తరువాత.. ఆయన తన ఆప్తమిత్రుడు అవంతి శ్రీనివాస్, పంచకట్ల రమేష్ బాబు, చింతలపూడి వెంకట్రామయ్య, పరుచూరి భాస్కర్ రావులతో కలిసి పీఆర్పీలో చేరారు. పీఆర్పీని చిరంజీవి కాంగ్రెస్ లో విలీనం చేసిన తరువాత వాళ్లందరూ అదే పార్టీలో కొనసాగారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో గంటా శ్రీనివాస రావుకు మంత్రి పదవి లభించింది. రాష్ట్ర విభజన తరువాత.. కాంగ్రెస్ లో కొనసాగితే మనుగడ ఉండదనుకున్న గంటా.. తన సన్నిహితులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. పీఆర్పీలో ఉండగా అనకాపల్లి అసెంబ్లీ నుంచి గెలిచిన గంటా.. టీడీపీలో చేరిన తరువాత భీమిలీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, విజయం సాధించారు. పీఆర్పీ తరఫున భీమిలీ నుంచి పోటీ చేసి గెలిచిన అవంతి శ్రీనివాస్ టీడీపీలో అనకాపల్లి లోక్ సభకు ఎన్నికయ్యారు. యలమంచిలి నుంచి పోటీ చేసిన పంచకట్ల అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
టీడీపీ హ్యాండివ్వడంతో జనసేనలో చేరిన గంటా క్యాంప్
టీడీపీలో టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తికి గురైన చింతలపూడి వెంకట్రామయ్య, పరుచూరి ఉమ్మడిగా జనసేన పార్టీలో చేరిపోయారు. అవంతి శ్రీనివాస్, పంచకట్ల రమేష్ బాబు మాత్రమే ఇన్నాళ్లూ గంటా వెంట ఉండిపోయారు. తాజాగా.. అవంతి శ్రీనివాస్ కూడా పార్టీ ఫిరాయించడం గంటా శ్రీనివాస్ క్యాంప్ ఖాళీ అయింది. గంటా క్యాంప్ లో మిగిలింది పంచకట్ల ఒక్కరే. ప్రస్తుతం గంటా, పంచకట్ల టీడీపీని వీడాలనే నిర్ణయానికి దాదాపు వచ్చినట్టేనని తెలుస్తోంది. వారిద్దరూ ఎటు వెళ్తారనేది ఇంకా తెలియరావట్లేదు. ప్రస్తుతం లాభనష్టాలను బేరీజు వేసుకునే పనిలో ఉన్నట్లు చెబుతున్నారు. భీమిలీలో గంటా గెలిచే పరిస్థితి లేదని సర్వే రూపంలో టీడీపీ ఇదివరకే మీడియాకు లీకులు ఇచ్చింది. ఫలితంగా - గంటా తనకు ఈసారి టికెట్ దక్కకపోవచ్చనే నిశ్చితాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. తన ఆప్తమిత్రుడు అవంతి శ్రీనివాస్ తరహాలోనే గంటా వైఎస్ఆర్ సీపీలో చేరుతారా? లేక ప్రత్యామ్నాయంగా జనసేన పార్టీని ఎంచుకుంటారా? అనేది తేలాల్సి ఉంది.
అవంతి చెప్పింది..ఆ ఇద్దరి గురించే
2014 ఎన్నికలకు ముందే తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నామని అవంతి శ్రీనివాస్ తాజాగా వెల్లడించారు. దీనికి బదులుగా తమ క్యాంప్ నకు అయిదు సీట్లు ఇవ్వాలని వైఎస్ జగన్ కు షరతు విధించామని అన్నారు. జగన్ మాత్రం ఇందుకు నిరాకరించారని, అయిదు సీట్లు ఇవ్వలేమని, మూడే ఇస్తామని తేల్చి చెప్పినట్లు వెల్లడించారు. తాము డిమాండ్ చేసినట్లుగా అయిదు సీట్లు ఇస్తామని తెలుగుదేశం పార్టీ హామీ ఇవ్వడంతో తనతో పాటు గంటా శ్రీనివాస్, పంచకట్ల రమేష్ బాబు, చింతలపూడి వెంకట్రామయ్య, పరుచూరి భాస్కర్ రావు టీడీపీలో చేరినట్లు చెప్పారు. అనంతరం టీడీపీ తమకు మొండి చెయ్యి చూపిందని అన్నారు. తనకు, గంటా శ్రీనివాస్ కు, పంచకట్లకు మాత్రమే టికెట్ ఇచ్చిందని అన్నారు. ఇలా తమను స్వయంగా చంద్రబాబు నాయుడే మోసగించారని అన్నారు. జగన్ అలా కాదని, తాను అయిదు సీట్లు ఇవ్వలేనని ఖచ్చితంగా చెప్పారని ప్రశంసించారు.
తోట త్రిమూర్తులు..
తెలుగుదేశం పార్టీకే చెందిన రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు కూడా రెండురోజులుగా నియోజకవర్గ పార్టీ కార్యకర్తలతో విస్తృతంగా చర్చిస్తున్నారు. టీడీపీలో కొనసాగాలా? వద్దా? అనే విషయంపైనే ఆయన చర్చిస్తున్నట్లు చెబుతున్నారు. నియోజకవర్గంలో టీడీపీ గెలిచే పరిస్థితి ఎంతమాత్రమూ లేదని ఆయన అంచనాకు రావడం వల్లే పార్టీని వీడాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష వైఎస్ఆర్ సీపీలో చేరాలా? లేక జనసేన పార్టీనా అనేది ఇంకా తేల్చుకోలేకపోతున్నారని సమాచారం.